న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్ను ఇవాళ సీబీఐ ఓపెన్ చేసింది. ఘజియాబాద్లోని సెక్టర్ 4 వసుంధరలో ఉన్న పంజాబ్ జాతీయ బ్యాంక్లో సిసోడియాకు లాకర్ ఉంది. అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో సిసోడియాను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం సిసోడియా ఇంట్లోనూ సీబీఐ సోదాలు చేపట్టింది. అయితే తన బ్యాంక్ లాకర్లో ఏమీ దొరకదని సిసోడియా సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 19వ తేదీన ఇంట్లో 14 గంటల పాటు సీబీఐ విచారణ చేపట్టిందని, కానీ అక్కడ ఏమీ దొరకలేదని ఆయన అన్నారు. లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ మొత్తం 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాంట్లో సిసోడియా పేరు కూడా ఉంది. లంచాలు తీసుకుని అర్హులు కానివాళ్లకు లైసెన్సులు జారీ చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది నవంబర్లో ప్రవేశపెట్టిన కొత్త పాలసీ వల్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ కొత్త పాలసీని విత్డ్రా చేశారు.