హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసులో ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు సీబీఐ స్పష్టం చేసింది. మరో కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి బీ శ్యాంబాబును ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వలేదని బుధవారం హైకోర్టుకు తెలిపింది. ఆయన పదవీ విరమణ చేయడమే ఇందుకు కారణమని, దీనిపై అప్పీల్ దాఖలు చేశామని చెప్పింది. ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి డీ మురళీధర్రెడ్డిని ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నది. 2008-09 మధ్యకాలంలో మురళీధర్రెడ్డి ఐఏఎస్ అధికారి కానందున ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి ఇవ్వాలని కేంద్రం సమాధానమిచ్చిందని, అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ఇంకా అనుమతి రాలేదని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. దీంతో తనపై సీబీఐ కేసును కొట్టివేయాలంటూ మురళీధర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రకటించారు.