కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ 11 మందిని అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్లో హింస, ఇతర నేరాలకు సంబంధించి రెండు వేర్వేరు కేసుల విచారణకు సంబంధించి ఆదివారం ఏడుగురిని, శనివారం నలుగురిని అరెస్ట చేశారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. గతంలో రాష్ట్ర పోలీసు బృందాలు జరిపిన కేసుల దర్యాప్తును సైతం ఆధీనంలోకి తీసుకున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించి సీబీఐ 30కిపైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా.. మూడు ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది.
గత నెలలో పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లైంగికదాడులు, హత్య వంటి దారుణాలు చోటుచేసుకోవడం దారుణమని పేర్కొంది. కొన్ని సంఘటనల్లో బాధితుల ఫిర్యాదులను అధికారులు నమోదు చేయలేదని తప్పుపట్టింది. బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) చేసిన సిఫార్సులను హైకోర్టు ఆమోదించింది. హింసాకాండపై ఆగస్ట్ 19న సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.