ధరలు పెరగనుండటంతో డిసెంబర్లో ఎగబడి కొనుగోళ్ళు
మారుతి, హ్యుందాయ్ మినహా అన్నీ టాప్గేర్లోనే
న్యూఢిల్లీ, జనవరి 1: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా కోలుకుంటున్నాయి. నూతన సంవత్సరంలో ఇంచుమించు అన్ని సంస్థలు తమ వాహన ధరలను పెంచుతున్నట్లు గతంలోనే ప్రకటించడంతో కొనుగోలుదారులు కొనుగోళ్ళకు మొగ్గుచూపారు. చిప్ల కొరత ఆటోమొబైల్ సంస్థలను వేదిస్తున్నప్పటికీ ధరలు పెరుగనుండటంతో కస్టమర్లు ముందస్తుగా బుకింగ్లు చేసుకున్నారు. కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మినహా అన్ని సంస్థలు డిసెంబర్ నెలకుగాను విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలతోపాటు నిస్సాన్, స్కోడాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. 2022లో వాహన అమ్మకాలపై ఆశాభావాన్ని వ్యక్తం చేసిన మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ..ప్రస్తుతం సంస్థ చేతిలో 2.3 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉన్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.