హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి హరీశ్రావు నేతృత్వంలో మంత్రుల సబ్కమిటీ సమగ్రంగా చర్చింది. బీఆర్కే భవన్లో సబ్కమిటీ బుధవారం భేటీ అయ్యింది. ధరణి పోర్టల్ ద్వారా అందుతున్న సేవలను హరీశ్రావు సమీక్షించారు. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను, వివిధ సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మూడ్రోజుల్లో వాటి అమలుపై సమీక్షిస్తామని వెల్లడించారు.
సమావేశంలో మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ వీ శేషాద్రి, మేడ్చల్ కలెక్టర్ హరీశ్, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, సీసీఎల్ఏ అధికారులు సత్యశారద, ఆర్డీవోలు శ్రీనివాస్, కిషన్రావు, క్రెడాయి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు, మంత్రి హరీశ్రావు నేతృత్వంలో సాగిన సబ్ కమిటీ సమావేశానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, జనరల్ సెక్రటరీ గౌతమ్కుమార్ హాజరయ్యారు. ధరణి పోర్టల్లో రైతులు, పట్టాదారులు ఎదుర్కొంటున్న సుమారు 20కిపైగా సమస్యలపై మంత్రులకు వినతిపత్రాలను అందజేశారు.