హుజూరాబాద్టౌన్ : దళిత బంధు పథకం నిలుపుదలకోసం ఎన్నికల సంఘానికి లేఖ రాసి పథకానికి అడ్డుపడినా బీజేపీ నాయకులకు, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే దళితులు నిజాయితీగా దళిత బంధు ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలవాలని, బీజేపీని భూస్థాపితం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు.
మంగళవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులకు మంచి చేయాలని, పేదరికం నుండి ధనికులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకొని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తుండగా బీజేపీ నాయకులు మాత్రం ఈ పథకం ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆపడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికే చాలా మంది దళితుల్లో 10 లక్షల రూపాయలు చొప్పున గ్రౌండింగ్ అయిందని, ఇలా మధ్యలో కుట్ర చేసిన బీజేపీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఓడిపోతాడని, గెల్లు శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలుస్తాడనే భయంతో ఇలా బీజేపీ నాయకులు కుట్ర చేసి దళితులతో చెలగాటం ఆడారన్నారు. దళితుల ఉసురు తగిలి బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం మట్టికొట్టుకు పోతుందన్నారు. పేదరికంతో అల్లాడుతున్న ఎంతోమంది దళితులను ఆర్థికంగా ఆదుకోవడమే కాక ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలని చూస్తున్న సీఎం కేసీఆర్ ఆశయానికి గండికొట్టిన బీజేపీకి ఈ ఉప ఎన్నికల్లో ఓటు ద్వారా దళితులు తగిన బుద్ధి చెప్పాలన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండు వేల కోట్లు జిల్లా కలెక్టర్ అకౌంట్లో జమ కాగ 17 వేల మందికి పైగా బ్యాంకు ఎకౌంట్లో గ్రౌండింగ్ జరిగిందని, మరొక రెండు, మూడు వేల మందికి డబ్బులు గ్రౌండింగ్ చేసే సమయంలోనే ఈ పథకాన్ని ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం వెనుక బీజేపీ కుట్రను దళితులు గుర్తించి ఓటుతో తిప్పికొట్టాలన్నారు.
బీజేపీ ఆపాలని చూసిన ఈ పథకం మరో పది పన్నెండు రోజుల్లో తిరిగి యథావిధిగా దళితులందరికీ రూ.10 లక్షల రూపాయలు గ్రౌండింగ్ అవుతుందని శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ నేతల కుట్రలను పసిగట్టి దళిత సోదరులు ఎవరు కూడా కలత చెందకుండా, అధైర్య పడకుండా 30న జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేసి బీజేపీని భూస్థాపితం చేసి తమ నిజాయితీని చాటుకోవాలన్నారు.