న్యూఢిల్లీ, జనవరి 30: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22కి సంబంధించి ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాతి రోజైన మంగళవారం నాడు లోక్సభలో కేంద్ర బడ్జెట్ (2022-23) ప్రవేశపెడుతారు. బడ్జెట్ చర్చపై ప్రధాని మోదీ ఫిబ్రవరి 7న సమాధానాలు ఇచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ సమావేశాలు రెండు దశలుగా జరుగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడుత, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడుత సమావేశాలు జరుగుతాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలకు అధికారులు చర్యలు తీసుకొన్నారు. పెగాసస్ స్పైవేర్ నిఘా, రైతుల సమస్యలు, భారత్-చైనా సరిహద్దు వివాదంపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్నాయి.