హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్న బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు పలు కాలేజీలు ముందుకు వస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం 14 కాలేజీల్లో బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో 11 కాలేజీల్లో మాత్రమే ఈ కోర్సులుండగా, తాజాగా మరో మూడు కాలేజీల్లో ఈ కోర్సులకు అనుమతినిచ్చారు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో మొత్తంగా 1,170 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. బ్రాంచీల వారీగా ఈసీఈలో అత్యధికంగా 195, ఈఈఈ 165, మెకానికల్ 150, సీఎస్ఈలో150 చొప్పున సీట్లు ఉన్నాయి.
పాలిటెక్నిక్ చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పిస్తారు. డిప్లొమా హోల్డర్లు ఉద్యోగానికి ఆటంకం ఏర్పడకుండా రెండో సంవత్సరంలో చేరి, మూడేండ్లల్లోనే బీటెక్ కోర్సును పూర్తి చేసుకోవచ్చు. బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులో ప్రవేశాలకు తొలిసారిగా రాష్ట్రస్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. ఈ ప్రవేశ పరీక్షకు టీజీ ఈసెట్(డబ్ల్యూపీ) అనే పేరును ఖరారు చేశారు. ఈ పరీక్షను ఆగస్టు 30న ఆఫ్లైన్లో నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు.