రామగిరి, ఆగస్టు 22 : ప్రజల కోసం నిరంతరం రాజీలేని సమరశీల పోరాటాలు నడిపిన ప్రజల మనిషి సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, ఎల్.శ్రావణ్ కుమార్ అన్నారు. అమరజీవి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా నల్లగొండ మక్దూం భవన్లో సురవరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమం నాయకుడిగా మొదలైన రాజకీయ ప్రస్థానం సి.పి.ఐ. ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జీవితమంతా రైతులు, కూలీలు, కార్మికులు, మధ్య తరగతి ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు. అణగారిన వర్గ ప్రజల హక్కులకై నిరంతరం పోరాటాలు సాగించారన్నారు. నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల కోసం డిండి నుండి నల్లగొండ వరకు పాదయాత్ర నిర్వహించి ఫ్లోరైడ్ సమస్యల పై పార్లమెంట్లో సుధీర్ఘ ఉపన్యాసం చేసి దేశ ప్రజలను నల్లగొండ వైపు తిప్పిన వ్యక్తి అన్నారు.
అహర్నిశలు ఉద్యమ పోరాటాలతో పాటు పార్టీ పటిష్టత కోరకు తుదిశ్వాస వరకు ఆయన చూపిన పోరాట పటిమ రాబోయే తరాలకు దిక్సూచిగా ఉంటుందన్నారు. నల్లగొండ జిల్లాతో వారికి విడదీయాలేని బంధం ఉందని, పెండింగ్ ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు, అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం తుది శ్వాస వరకు పోరాడిన గొప్ప నేత అన్నారు. సువరం లేని లోటు లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు తీరని లోటు అన్నారు. పార్లమెంట్లో లేబర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కార్మికులకు ఉపయోగపడే అనేక కార్మిక చట్టాల రూపకల్పనకు జీవం పోశారన్నారు. వారి జీవితం భావితరాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరస్వామి, పట్టణ కార్యదర్శి కె ఎస్ రెడ్డి, నాయకులు ముండ్ల ముత్యాలు, ఎం.నందం, కె.నారాయణ, కే.ప్రద్యుమ్న రెడ్డి, యూసుఫ్, బాసాని వెంకటయ్య, సీతారాములు కౌసల్య, విజయ వీరయ్య పాల్గొన్నారు.