BSNL | న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పట్లో టారిఫ్ చార్జీలు పెంచేది లేదని స్పష్టంచేసింది. ఇప్పటికే టెలికం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలను 30 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. దీనిపై బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి మాట్లాడుతూ..సమీప భవిష్యత్తులో టారిఫ్ చార్జీలను పెంచాలనుకోవడం లేదని, ప్రస్తుతం కస్టమర్ల సంతోషాన్ని, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు చెప్పారు. కంపెనీకి చెందిన నూతన లోగోను టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వచ్చే ఏడాది లక్ష 4జీ సైట్లను నెలకొల్పాలనుకుంటున్నట్లు, భవిష్యత్తులో 5జీగా మారనున్నాయన్నారు.
నూతన సేవల వివరాలు..
స్పామ్ బ్లాకర్స్: స్పామ్ రహిత నెట్వర్క్ను అందించేందుకుగాను సంస్థ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. మోసపూరిత ఎస్ఎంఎస్లు, కాల్స్ను ముందుగా గుర్తించి, ఆటోమేటిక్ వాటిని బ్లాక్ చేయనున్నది.
ఐపీ టీవీ: ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ లైవ్ టీవీ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నది. దీంతో ఎఫ్టీటీహెచ్ యూజర్లకు 500 వరకు ప్రీమియం చానెళ్లను అందించనున్నది.
ఏ సమయంలోనైనా సిమ్: సిమ్లకోసం ప్రత్యేక కియోస్క్ కేంద్రాలను నెలకొల్పుతున్నది. ఈ కేంద్రాల్లో సిమ్ యాక్టివేషన్, కేవైసీ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చును.