శ్రీనగర్ : పాక్ అంతర్జాతీయ సరిహద్దు (International Border) వెంట పాక్ నుంచి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసేందుకు ఉగ్రవాదులు చేసిన కుట్రను బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ డీఐజీ ఎస్పీఎస్ సంధు తెలిపారు. బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్న వాటిలో నాలుగు పిస్టల్స్, ఎనిమిది పిస్టల్ మ్యాగజైన్స్, 232 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నదని చెప్పారు.
గత ఆరు నెలలుగా డ్రోన్ల ద్వారా సరిహద్దులోని ఈ వైపునకు ఆయుధాలను జారవిడిచేందుకు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్కు ప్రయత్నాలు జరిగాయి. గత శనివారం ఫలైన్ మండల్లోని సౌంజనా గ్రామంలోని అంతర్జాతీయ సరిహద్దులోనూ డ్రోన్ సహాయం జారవిడిచిన ఏకే అస్సాల్ట్ రైఫిల్, మూడు మ్యాగజైన్లు, 30 రైండ్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గత నెల 27న సైతం బీఎస్ఎఫ్ నాలుగు పిస్టల్స్, ఎనిమిది మ్యాగజైన్లు, వంద రౌండ్లు, కిలో డ్రగ్స్తో పాటు రూ.2.75లక్షలు నకిలీ భారత కరెన్సీని అఖ్నూర్ సెక్టార్లోని ఐబీ సరిహద్దు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.