మార్కెట్ ట్రెండ్ను గమనిస్తే.. ఈ వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశాలే ఉన్నట్టు కనిపిస్తున్నది. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం సూచీలు ఆకర్షణీయ లాభాలనే అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,293.65 పాయింట్లు పుంజుకొని 82,500.82 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 391.10 పాయింట్లు ఎగబాకి 25,285.35 దగ్గర స్థిరపడింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా మదుపరులలో కొనుగోళ్ల ఉత్సాహం కొనసాగవచ్చనే మెజారిటీ నిపుణులు చెప్తున్నారు. పైగా ఈ దీపావళితో మార్కెట్లకు కొత్త సంవత్సరం మొదలుకానున్నది. ఇప్పటికైతే ఈ ఏడాది సెన్సెక్స్ 4,400 పాయింట్లదాకా, నిఫ్టీ 1,400 పాయింట్లకుపైగా పెరిగాయి. ఈ క్రమంలో చివరి వారం పెట్టుబడులతోనే నూతన ఏడాదికి ఇన్వెస్టర్లు స్వాగతం పలుకుతారన్న అంచనాలైతే ఉన్నాయి.
ఇవే నిజమైతే బుల్ రన్ ఉంటుంది. పండుగ సీజన్ దృష్ట్యా ఆటో, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు ఆకర్షణీయంగా ఉండవచ్చు. ఇక ఎప్పట్లాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యమే. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రతీకార సుంకాలకు పదును పెడుతుండటంతో గ్లోబల్ మార్కెట్లలో అలజడులకు దారితీయవచ్చు. ఇదే జరిగితే మార్కెట్లు నష్టాల్లో, బంగారం-వెండి ధరలు విజృంభించడం ఖాయమనే అభిప్రాయాలే ఉన్నాయి. ఇప్పటికే ఆల్టైమ్ హైల్లో ఈ మెటల్ ప్రైస్లున్నది తెలిసిందే. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,500-25,700 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.