శ్రీశైలం : శ్రీశైలంలో సంక్రాంతి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం భ్రమరాంబమల్లిఖార్జున స్వామిఅమ్మవార్లు భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు జరిగే బ్రహోత్సవాల్లో రెండోరోజు ఉదయం స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. లోక కల్యాణాన్ని కోసం వేదపండితులు, అర్చకులు యాగశాలలో చండీశ్వరస్వామి, జపాలు, పంచావరణార్చనలు, నిత్యవాహనాలు, రుద్రహోమం, మండపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాలం ప్రదోష కాలపూజలు, హోమాలు, జపానుష్టానాలు జరిపించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకరమండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలో భృంగివాహనంపై వేంచేంపు చేసి ప్రత్యేక పూజలు, పుష్పార్చనాధిక్రతువులు చేశారు. గ్రామోత్సవంలో భాగంగా భృంగివాహనాధీశులైన స్వామి అమ్మవార్లను గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలు వీరభద్రస్వామి వరకు ఊరేగించారు. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, హరిదాసులు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. గ్రామోత్సవంలో కార్యనిర్వాహణాధికారి లవన్న, ఈఈ రామకృష్ణ పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు మల్లయ్య, హరిదాస్, ఫణీంధ్ర ప్రసాద్ ,శ్రీనివాస్ రెడ్డి, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, పర్యవేక్షకుడు అయ్యన్న, రవి, మధుసూదన్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
హిందూ సాంప్రదాయ సనాతనధర్మంలో భాగంగా నేడు భోగి పండుగను సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్నట్లు ఈఓ లవన్న తెలిపారు. కార్యక్రమంలో ఐదు సంవత్సరాలలోపు వయస్సుగల చిన్నారులకు సామూహికంగా భోగిపండ్లు పోయనున్నట్లు చెప్పారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో తమ పేర్లు నమోదు చేసుకున్నవారితో పాటు భక్తుల పిల్లలు కూడా పాల్గొనేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీంతో పిల్లలకు బాలారిష్టదోషాలు తొలగి, ఆయురారోగ్యాలు కలుగుతాయని వేద పండితులు తెలిపారు.