KTR | హైదరాబాద్ : కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీని వీడిన పట్నం మహేందర్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటూ పట్నం మహేందర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొన్నాను. 4 స్థానాల్లో గెలిచాం. కుల్కచర్లలో మీటింగ్ చూసిన తర్వాత పరిగి ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలుస్తారని అనుకున్నాను. అంత జోష్, ఉత్సాహం ఉండే. స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం. వికారాబాద్లో కూడా తండోపతండాలుగా వచ్చారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ స్వల్ప తేడాతో ఓడిపోయాం. తాండూరులో గెలుపు ఏకపక్షంగా ఉంటుందనుకున్నా. ఎందుకంటే మహేందర్ రెడ్డిని బిజీగా పెట్టాం. పోటీ లేదు. ఎదురు లేదనుకున్నాం.. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అని పెద్దలు చెబుతారు. మంత్రిని చేశాం.. ఇక లొల్లి పెట్టడు అనుకున్నాం. మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డికి సహకరిస్తడు అనుకున్నాం. కానీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత ఆ రెండు నియోజకవర్గాల్లో అడ్డా పెట్టి, పార్టీలోనే ఉండుకుంటూ వెన్నుపోటు పొడిచి మన నాయకులను ఓడగొట్టారు. మెతుకు ఆనంద్, రోహిత్ రెడ్డి ఓటమికి మన వాళ్లే కారణం అనేది అక్షర సత్యం. మోసం పోయాం అని కేటీఆర్ తెలిపారు.