KTR | హైదరాబాద్ : ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి.. కేవలం అధికారం, ఆస్తుల కోసమే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని కేటీఆర్ పేర్కొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమై, లోక్సభ ఎన్నికలపై చర్చించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న తర్వాతనే, ఆయన ఎవరో ప్రపంచానికి తెలిసిందన్నారు. 2019లోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అయినా కూడా ప్రతి కార్యకర్త కష్టపడి గెలిపించారని గుర్తు చేశారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. నియోజకవర్గంలో కూడా ఆయనకు స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారు. పార్టీ సీనియర్ నాయకురాలు కవిత తన సోదరి అని చెప్పుకునే రంజిత్ రెడ్డి.. ఆమెను అరెస్టు చేసిన రోజే నవ్వుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడు అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని, పార్టీకి మోసం చేసి వెళ్ళాడు అని చర్చించుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు.
గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరు. అదే నిజమైతే దేశంలో పార్టీలు ఉండవు. స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి మనసులు కలిసినంత మాత్రాన… మిలాఖత్ అయినంత మాత్రనా.. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొని ఉంది. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యం అని కేటీఆర్ పేర్కొన్నారు.
సామాజిక సమీకరణాల రీత్యా బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుందని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులతోపాటు బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా అండగా నిలబడిన వ్యక్తి. ఒకవైపు బీసీల కోసం పాటుపడుతూనే, మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకుపోయిన మంచి మనిషి, నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని పేర్కొన్నారు.