KTR | హైదరాబాద్ : రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక పార్టీకి, కొంతమంది నాయకుల ఆధీనంలో ఎన్నికల సంఘం ఉన్నట్టుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అఫిషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో వ్యక్తిగత దూషణాలు, బూతులు పుంఖాను పుంఖాలుగా కనబడుతున్నాయి. అవేవీ కూడా ఈసీకి కనబడం లేదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఈసీ వైఖరి ఉంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో వీరికి ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని అపహాస్యం చేసే విధంగా పని చేస్తుంది. ఒక పార్టీకి, కొంత మంది నాయకుల ఆధీనంలో ఉన్నట్టు కనబడుతుంది. మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మోదీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో కేంద్ర ఎన్నికల సంఘం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. 48 గంటల నిషేధంతో కేసీఆర్ను తాత్కాలికంగా ఆపగలరు.. కానీ మీరేం చేయలేరు. కాంగ్రెస్, బీజేపీ నేతల అరాచకాలకు, ఏజెన్సీల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.