Mallikarjun Kharge | ఇండియా కూటమిలోకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ను తీసుకునే విషయమై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తామన్న మమతా బెనర్జీపై తమకు నమ్మకం లేదని, ఆమె బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యపై ఖర్గే స్పందించారు. ఆమెను కూటమిలోకి తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకునేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే తప్ప అధీర్ రంజన్ కాదని స్పష్టం చేశారు. ఇండియా కూటమి గెలిస్తే బయటి నుంచి మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ చెబుతున్నారన్న ఖర్గే.. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు కూడా బయట నుంచే మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు.
అధీర్ రంజన్ చౌదరి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదని, ఏ నిర్ణయమైనా పార్టీ అగ్రనాయకత్వం, అధిష్టానం సమిష్టి నిర్ణయమే ఉంటుందని ఖర్గే చెప్పారు. పార్టీలో ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి.. ప్రస్తుత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లోని బరంపూర్ నుంచి పోటీలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తడంతో లోక్ సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. దీనిపై మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘మేం ఇండియా కూటమికి బయట నుంచి అన్ని విధాల సాయం చేస్తాం. కావాల్సిన నాయకత్వం అందిస్తాం. బెంగాల్ తల్లులకు, సోదరీమణులకు ఏ సమస్యా లేకుండా చూస్తాం’ అని అన్నారు.