శ్రీనగర్: దేశ అంతర్గత విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. (Ghulam Nabi Azad) అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పాకిస్థాన్ సమస్యను ఎన్నికల్లో ఎక్కువగా తీసుకురావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ‘జాతీయ, స్థానిక ఎన్నికల్లో పాకిస్థాన్ అంశాన్ని తీసుకురావడం కొత్త ట్రెండ్గా మారింది. గత 75 ఏళ్లలో పాకిస్థాన్ అత్యంత బలహీనంగా ఉంది. అలాంటి పాకిస్థాన్ ఎన్నికల్లో ఒక ముఖ్య అంశంగా మారింది. భారత దేశానికి చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటివి’ అని అన్నారు. బాహ్య విషయాలకంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంతర్గత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
కాగా, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి లోక్సభ ఎన్నికలు పూర్తి భిన్నంగా ఉన్నాయని గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా బురదజల్లడం జరుగుతోందని విమర్శించారు. ప్రతి రాజకీయ పార్టీ సంబరపడిపోతున్నాయని, అయితే రాజకీయాల పరంగా ఇది మంచిది కాదని అన్నారు. ఆరోగ్యకరమైన రాజకీయ ప్రసంగాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.
మరోవైపు జమ్ముకశ్మీర్లోని ప్రాంతీయ పార్టీలపై గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, స్థానిక పార్టీలు ఏమి చేశాయని ఆయన ప్రశ్నించారు. ‘ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కశ్మీర్ ఎంపీలు ఎవరూ మాట్లాడలేదు. నన్ను బీజేపీ అనుకూల వ్యక్తిగా ముద్రించిన వారు గతంలో ఆ పార్టీలో భాగమే. వారి ఆరోపణలకు అర్థం లేదు’ అని విమర్శించారు.