CM KCR Public Meeting | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్, జనగామ, భువనగిరి, రాజన్న సిరిసిల్ల నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. మంత్రి హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభకు హాజరై.. ప్రసంగించారు. సభకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీ కోసం..
తెలంగాణ భారతదేశానికి తలమానికమైతే.. సిద్దిపేట నియోజకవర్గం యావత్ తెలంగాణకే తలమానికంగా హరీశ్రావు నాయకత్వంలో ముందుకుపోతుంది. సిద్దిపేటను జిల్లా చేసుకున్న తర్వాత చాలా బాధలు పోయినయ్. ఇవాళ రైలొచ్చేసింది. అన్నీ రకాల సదుపాయాలు ఉన్నాయి. గొప్ప వర్తక, వాణిజ్య కేంద్రంగా , ఐటీ కేంద్రంగా, కాలుష్యం లేని పరిశ్రమల కేంద్రంగా.. గొప్ప ధాన్యం పండించే వ్యవసాయ క్షేత్రంగా సిద్దిపేట ఎదగడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఇదే రకంగా హరీశ్ను మరొకసారి అద్భుతంగా జీవించి.. మీ మెజారిటీని.. మీరే తిరగరాయాలి. బ్రహ్మాండంగా విజయం సాధించేటట్టు కారు గుర్తుకే ఓటు వేయాలి.
తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత. ఒక గౌరవం.. మీరు పోయిన ఎన్నికల్లోనే సాధించి చూపించారు. హరీశ్రావుకు లక్ష పైచిలుకు మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండమైన రికార్డు నెలకొల్పారు. మీ అందర్నీ కోరేది ఒక్కటే. హరీశ్రావు పనితనం కానీ.. మన సిద్దిపేట పటుత్వం కానీ.. మల్ల ఒకసారి ఆ రికార్డు సిద్దిపేటకే దక్కాలి. ఇంకా భారీ మెజారిటీతో హరీశ్రావును గెలిపించాలి.
సిద్దిపేటకు ఒక్కటే ఒక్కటి తక్కువుంది.. అది గాలిమోటారు రావాలి. మంచి నీళ్లు వచ్చినయ్.. నీళ్లు వచ్చినయ్.. అధికారం వచ్చింది.. గౌరవం వచ్చింది.. మెడికల్ కాలేజీ వచ్చింది.. మినీ యూనివర్సిటీ కూడా వస్తుంది.. ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్లు వస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు వస్తున్నాయి. సిద్దిపేటకు హైదరాబాద్ చాలా సమీప ప్రాంతం. ఇవతలి పక్కన ఉన్న కంటోన్మెంట్ దాటితే 75 కిలోమీటర్లు ఉంటది. సిద్దిపేటకు మంత్రి హరీశ్రావు పట్టుబట్టి ఐటీ హబ్ కూడా తెచ్చిండు. రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన వజ్రపు తునకలా తెలంగాణలో సిద్దిపేట తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
హరీశ్రావు మీద ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఒక జోక్ ఉంది. అదేంటంటే.. హరీశ్ అక్కడ తిరుగుతడు.. ఇక్కడ తిరుగుతడు.. తట్టెడు పెండ కనబడితే సిద్దిపేటలో వేసుకుంటడు అని చెబుతరు. అంటే ఆయన టైమ్లో.. మంత్రి అయిన నాటి నుంచి నేటి దాకా ప్రతి ఒక్క విషయంలో.. ప్రతి కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తేవడంలో అద్భుతమైన కృషి చేస్తారు. నిజంగా హరీశ్రావు జాగాలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంత చేయగలనో లేదో తెలియదు. అంత బ్రహ్మాండంగా.. అద్భుతంగా పనిచేస్తుండు.
మీ అందరికి మనవి చేసేది ఒక్కటే. సిద్దిపేటకు ఏం జరిగిందో చెబితే బాగోదు. నేను హరీశ్రావును పొగిడినట్టు అయితది. మీకు ఒక్కటే మాట చెబుతున్నా. ఒక్కటే మాటకు నూరు అర్థాలు తీసుకోవాలే. కరీంనగర్లో ఎంపీగా గెలిచిన.. తెలంగాణ కోసం ఢిల్లీలో పనిచేయాలి. రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోవాలి. నా కన్న ఊరు.. పెంచిన మీ అందర్నీ విడిచిపోవాలి. అక్కడ కరీంనగర్ రోడ్డులో ఒక హాలులో మీటింగ్ పెట్టుకున్నం. ఒకపక్క నేను ఏడ్వ. మరోదిక్కు హాలు మొత్తం ఏడ్వ. అందరం ఓ 10 నిమిషాలు ఏడ్చినం. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో నేను తీసుకొచ్చి.. ఆరడుగుల బుల్లెట్ హరీశ్ను మీకు అప్పగిస్తే బ్రహ్మాండంగా.. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీశ్ పనిచేసి నా మాట నిలబెట్టాడు. మీ గౌరవం కాపాడాడు.
కరీంనగర్ ఎంపీగా పోయినా.. మహబూబ్నగర్ ఎంపీగా పోయినా, గజ్వేల్ ఎమ్మెల్యేగా పోయినా.. కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి పాదాల దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టే పోతాను అని మీ అందరికీ తెలుసు. ఇంత పెనవేసుకున్న అనుబంధం. దాదాపు 50 సంవత్సరాల కాలం.. కలిసిమెలిసి బతికిన బతుకులు మనవి.
ఆనాడు మంచినీళ్లు లేని సిద్దిపేట.. సాగునీరు లేని సిద్దిపేట.. బంగారంలాంటి భూములు ఉన్నా.. పంటలు పండించుకోజాలని సిద్దిపేట. కానీ మీ అందరి దయ.. ఆశీర్వాదం.. అధికార పార్టీని వదిలేసి.. మీ అందరి దగ్గర ఆజ్ఞ తీసుకుని.. తెలంగాణ తల్లిని విముక్తి చేస్తే తప్ప.. ఈ గడ్డకు న్యాయం జరగదని మొండి పట్టుదలతో తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన. ఉద్యమం ప్రారంభించిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. నాకు బస్సు గుర్తు కేటాయించారు. బస్సు గుర్తు తీసుకొని వస్తే.. యావత్ సమైక్యవాదులు వచ్చి.. సిద్దిపేటలో అడ్డా పెట్టి కోట్లు కోట్లు ఖర్చు పెట్టినా.. వాళ్లను తిప్పికొట్టి 60 వేల మెజారిటీతో నన్ను విజయుడ్ని చేసి పంపించారు. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది కూడా సిద్దిపేట గడ్డనే అని ఏనాడు మరిచిపోను
సిద్దిపేట పట్టణంలో మంచినీళ్ల కరవు వస్తే.. వార్డుకొక ట్యాంకర్ పెట్టించి.. 4 బోరు బండ్లు తీసుకొని మిత్రులతో బయల్దేరినం. ఉదయం ఐదున్నరకు బయల్దేరితే సాయంత్రం 6 వరకు 100 బోర్లు వేస్తే.. రెండు బోర్లలో మాత్రమే కొంచెం తేమ వచ్చింది.. నీళ్లు రాలే. మంచినీళ్ల కోసం సిద్దిపేట పడ్డ తిప్పలు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధైతది. ఆనాడే లోయర్ మానేరు డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చి జలజాతర చేసుకున్నం. ఈ రోజు మిషన్ భగీరథ తెలంగాణ మొత్తం అమలవుతుందంటే.. సిద్దిపేట మంచినీళ్ల పథకమే దానికి పునాది.
చింతమడకలో చాలా చిన్నగా ఉన్న టైమ్లో.. చనుబాలు తాగే టైమ్లో.. మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే.. ఆ ఊళ్లో ఉండే ఓ ముదిరాజ్ తల్లి ఆమె చనుబాలు ఇచ్చి నన్ను సాదింది. ఈ గడ్డతో అంత అనుబంధం ఉంది. ఇక్కడ నేను పాదయాత్ర చేయని గ్రామం లేదు. తిరగని రోడ్డే లేదు. చూడని కుంటలు, చెరువులు లేవు.
జనని జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరీయాసి.. ఈ మాట అన్నది సాక్షాత్తూ శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు. స్వర్గం కంటే నా జన్మభూమే గొప్పది. దానికి మించింది లేదు.. సిద్దిపేట పేరు విన్నా.. సిద్దిపేటకు వచ్చినా.. సిద్దిపేట గురించి ఆలోచన వచ్చినా నా మనసులో కలిగే భావన ఇది. సిద్దిపేట గడ్డ నన్ను సాదింది.. పెద్దగా చేసింది.. చదువు చెప్పింది. రాజకీయ జన్మనిచ్చింది. నాయకుడ్ని చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే ఎత్తుకు పెంచిన గడ్డ.. నాగడ్డ అని గర్వంగా చెబుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిపి.. ముందుకు తీసుకుపోగలుగుతున్నా అంటే.. ఈ గడ్డ నుంచి నాకు దొరికిన రక్తం, మాంసం, బుద్ది, బలం. అన్నీ ఈ గడ్డ పుణ్యమే. నన్ను ఇంతవాణ్ని చేసినటువంటి నా మాతృభూమికి, నా తల్లికి శిరస్సు వంచి వినయపూర్వకంగా నమస్కారం చేస్తున్నా. నన్ను ప్రతి సందర్భంలో విజేతగా నిలబెట్టిన సిద్దిపేట గడ్డ రుణం ఈ జన్మలో ఏమిచ్చినా తీర్చుకోలేను.
సీఎం కేసీఆర్ రైతుల గౌరవాన్ని పెంచారు. రైతుల్లో ఇవాళ ధైర్యం వచ్చింది. ఆత్మవిశ్వాసం పెంచారు. కేసీఆర్ గురించి సిద్దిపేట ప్రజలకు బాగా తెలుసు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటే చింతమడకలోని మైసమ్మకుంటలో వ్యవసాయం చేశారు. ఆనాడు కరవు మంత్రిగా ఉంటే వ్యవసాయం చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉంటే వ్యవసాయం చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రిగా ఉన్నా వ్యవసాయం చేశారు. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ రోజు కూడా వ్యవసాయం చేసే నిఖార్సయిన రైతుబిడ్డ మన కేసీఆర్. ఈ రాష్ట్రం ఒక రైతు నాయకుడు చేతిలో ఉంది కాబట్టే.. రైతులంతా సంతోషంగా ఉన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు వచ్చినా.. రైతుబంధు వచ్చినా.. రైతుబీమా వచ్చినా.. చెక్డ్యామ్లు కట్టి చెరువులు బాగు చేసి.. గోదావరి నీళ్లు తెచ్చి రైతులకు అండగా నిలబడ్డారు.
సిద్దిపేట జిల్లా కావాలని, సిద్దిపేటకు గోదావరి నీళ్లు రావాలని.. సిద్దిపేటకు రైలు రావాలని కొన్ని దశాబ్దాలుగా కలలు ఉండేవి. ఇవి ఎన్నికల నినాదాలు.. గోడ మీద రాతలు.. కానీ ఈరోజు సిద్దిపేట జిల్లా ట్యాగ్లైన్ అయిన ఆ రైలును, జిల్లాను, నీళ్లను అందించిన కేసీఆర్కు ఇదే ఘనమైన స్వాగతం. కేసీఆర్ను కారణజన్ముడు అని అంటారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. సీఎం కేసీఆర్ను కలిసినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. ' కొంతమంది కలలు కంటారు. కానీ ఆ కలలు నిజం చేసే అదృష్టం కొంతమందికే దక్కుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రావాలని స్వప్నించారు. తెలంగాణను సాధించారు. ఆ సాధించిన తెలంగాణను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దే అవకాశం మీకే దక్కింది. అదృష్టవంతులు' అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. సిద్దిపేట జిల్లా విషయంలో కూడా ఆరోజు సిద్దిపేట ఎమ్మెల్యేగా.. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దరఖాస్తు ఇచ్చిన చేతులతోనే సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అందుకే ఆయన కారణజన్ముడు.