హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, బీఆర్స్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సహా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అక్రమాలకు పాల్పడిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిన్న హరీశ్ రావు శాసన సభసాక్షిగా ఆధారాలు బయటపెట్టారు.
అక్రమాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. మరి చర్యలు ఎందుకు లేవని నిలదీశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ తో సీఎం రేవంత్ కూడా సంబంధం ఉందని ఆరోపించారు. అందుకే మంత్రి పొంగులేటిని రేవంత్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి కుటుంబాన్ని కాపాడేందుకు సీఎం సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పు చేయనప్పుడు విచారణను ఎదుర్కొనేందుకు భయమెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.