సంగారెడ్డి/సంగారెడ్డి అర్బన్/ కంది, నవంబర్ 27: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. సంగారెడ్డి, సదాశివపేట, కంది, కొండాపూర్ మండలాల నుంచి అశేషజనం తరలివచ్చారు. సుమారు 50 వేల మంది జనం రావడంతో సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి నియోకవర్గ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను గెలిపించుకుంటేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని, ఇంతమంది జనసముద్రాన్ని చూస్తుంటే గెలుపు ఖాయమయిందన్నారు. మెజార్టీలో పోటీ పడుతున్నాడని అర్థమవుతుందని, ప్రతిపక్షాలు కనుచూపు మేరలో ఉన్నారనడానికి ఈ జనమే నిదర్శమని ముఖ్యమంత్రి వ్యా ఖ్యానించారు. జననీ జన్మ భూమి అంటూ నేను ఈ గడ్డబిడ్డనే అని, గతంలో సంగారెడ్డిలో నాల్సాబ్గడ్డ నుంచి గల్లీగల్లీ తిరిగి పాదయాత్ర చేశానని గుర్తు చేశారు.
ఇప్పటికే కొంతమంది పాతతరం నాయకులు, అభిమానులు తనకు తెలుసని, పట్టణవాసుల ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. అందుకోసం బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను గెలిపించి నియోజవర్గ అభివృద్ధికి బాటలు వేసేది మీ చేతుల్లో ఉందని ప్రజలను కోరారు. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలా, ప్రజలకు అందుబాటులో లేని నాయకులు కావాలా అని ముఖ్యమంత్రి ప్రజలకు గుర్తు చేస్తూ ఈసారి ఎన్నికల్లో చింతా ప్రభాకర్ను గెలిపించి అభివృద్ధి ప్రదాతలుగా ప్రజలే నిలవాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎన్నికల కోఆర్డినేటర్ పట్నం మాణిక్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు బొంగుల విజయలక్ష్మి, పిల్లోడి జయమ్మ, నాయకులు మామిండ్ల రాజేందర్, బొంగుల రవి, గోవర్ధన్నాయక్, కొండాపూర్ మండల ఇన్చార్జి తిరుపతిరెడ్డి, మలక్పేట్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనితానాయక్, ముఖీమ్, శివరాజ్పాటిల్, రాజేశ్వర్రావుదేశ్పాండే, ఎంఏ హకీం, బీరయ్యయాదవ్, మల్లెపల్లి జగదీశ్వర్, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
సంగారెడ్డి, నవంబర్ 27: ప్రజా ఆశీర్వాదసభకు తరలివచ్చిన అశేష జనవాహినిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ప్రభాకర్ను గమనించిన ఆర్థిక వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు భుజం తట్టి ఓదార్చారు. సోమవారం పట్టణంలోని తారా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గం నుంచి తరలివచ్చిన ప్రజలను చూసి చింతా ప్రభాకర్ ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. అశేషంగా తరలివచ్చిన జనాలను చూసి ప్రభాకర్ కండ్లనీళ్లు తెచ్చుకున్నారు. ఇంతమంది రుణం ఎలా తీర్చుకోవాలని, ఏం ఇచ్చినా రుణం తీరిపోదని మంత్రికి వివరించారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ప్రజా సేవకుడిగా ఉండి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావుల ఆశీర్వాదాలు ఉండాలని ప్రభాకర్ కోరారు.