రాజన్న సిరిసిల్ల మే 7(నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : కేంద్రమంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై వ్యక్తిగత విమర్శలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భగ్గుమన్నారు. బండి సంజయ్ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రి సంజయ్ కేటీఆర్కు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాతే పర్యటనకు రావాలని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఉదయాన్నే బీఆర్ఎస్ నేతలను సిరిసిల్ల పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ లను హౌస్ అరెస్టు చేశారు. జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు తో పాటు బీఆర్ఎస్ వై నేతలను సిరిసిల్ల బైపాస్ రోడ్డులో అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీసులు అక్రమ అరెస్ట్ లు చేసినప్పటికీ ఊరుకోబోమని, కేటీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంపై తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. భేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని, క్షమాపణ చెప్పే వరకు ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలు తీవ్ర వాగ్వాదం జరిగింది. బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖబర్దార్ బండి సంజయ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో సిరిసిల్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్ అయిన వారిలో మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.