Harish Rao | నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్పాయిజన్ జరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. ఫుడ్పాయిజన్ జరిగి 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై పది రోజులు కూడా గడవకముందే మళ్లీ ఫుడ్పాయిజన్ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంతులు, కడుపునొప్పితో 30 మంది విద్యార్థులు జిల్లా దవాఖానాలో చేరిన దుస్థితి నెలకొందని అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని హరీశ్రావు మండిపడ్డారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని విమర్శించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని అన్నారు. మాటలే తప్ప చేతలు లేని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలవ్వాలని.. ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని ప్రశ్నించారు.
వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి, పది రోజులు కూడా గడవలేదు. మళ్ళీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్?
30 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో మహబూబ్ నగర్ జిల్లా దవాఖానలో చేరిన దుస్థితి.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్… pic.twitter.com/HtDsTqZZ4N
— Harish Rao Thanneeru (@BRSHarish) November 26, 2024
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్పాయిజన్ జరిగింది. మంగళవారం నాడు మధ్యాహ్న భోజనం తిని 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత పలువురు విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
మాగనూరు పీహెచ్సీలో విద్యార్థులకు చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న పలువురిని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాగనూరులో ఫుడ్ పాయిజన్ జరగడం ఈ వారంలో ఇది మూడోసారి. దీనిపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.