KCR : బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం జిల్లాలో గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ గుర్తుచేశారు. పోడు పట్టాలతోపాటు రైతుబంధు, రైతు బీమా సౌకర్యాలు కల్పించామని, కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు రైతుబంధు ఇవ్వడం లేదని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇప్పుడు సింగరేణిని కూడా ముంచే పనిలో ఉన్నదని మండిపడ్డారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని గిరిజనులకు పోడు పట్టాలు అందజేసినం. అందులో కొత్తగూడెం జిల్లాకే అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చినం. ఈ జిల్లాలో 1.55 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు వచ్చినయ్. పోడు పట్టాలు ఇవ్వడంతోపాటు వెంటనే రైతుబంధు ఏసినం. రైతు బీమా కల్పించినం. ఇయ్యాల గిరిజన రైతులకు రైతుబంధు వచ్చిందా..? పోడు భూములకు రైతుబంధు వచ్చిందా..?’ అని రోడ్ షోకు వచ్చిన జనాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. వాళ్లు రైతుబంధు రాలేదని చెప్పడంతో ‘మరె పోరాటం చేద్దామా..?’ అన్నారు. అందరూ ‘చేద్దాం.. చేద్దాం..’ అనడంతో ‘అయితే మీరందరూ సిద్ధంగా ఉండండి’ అని చెప్పారు.
‘సింగరేణి బిడ్డలకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి లాభాలు చేకూర్చినమో మీకు తెలుసు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని కూడా ముంచే పనిలో ఉన్నది. మీ అందరికీ తెలుసు ఈ ముఖ్యమంత్రి ఛోటేభాయ్, నరేంద్రమోదీ బడేభాయ్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సింగరేణి బొగ్గు ఉండంగ గూడా ఇదే నరేంద్రమోదీ.. ‘మీరు అదానీ ఆస్ట్రేలియా నుంచి తెచ్చే బొగ్గును దిగుమతి చేసుకోవాలని చెప్పిండు. మాకే సింగరేణి ఉంది. మా బొగ్గు మాకుంది. మీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకు అన్న. ఒక్క టన్ను కూడా కొనం అని ఖరాఖండిగా చెప్పిన. ఇవన్నీ మీరు ఆలోచించాలె’ అని కేసీఆర్ సూచించారు.