ముంబై, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడటంతో సూచీలు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. మధ్యహ్నాం వరకు తీవ్ర ఒత్తిళ్ళకు గురైన దేశీయ సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు బ్లూచిప్ సంస్థలు అధికంగా లాభపడటం కలిసొచ్చింది. ప్రారంభంలో 500 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు లాభాల్లోకి వచ్చింది. 231.29 పాయింట్లు అధికమై 57,539.49కి చేరుకోగా, నిఫ్టీ 69 పాయింట్లు అందుకొని 17,222 వద్ద నిలిచింది.