ముంబై, ఏప్రిల్ 20: ఐదు ట్రేడింగ్ సెషన్లుగా స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న భారీ నష్టాలకు బుధవారం బ్రేక్పడింది. హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఇటీవల క్షీణించిన ఐటీ, ఫైనాన్స్, వినియోగ రంగాల షేర్లను ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోలు చేయడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 574 పాయింట్లు పెరిగి 57,037 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 178 పాయింట్లు అధికమై 17,137 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. విలీన వార్త వెలువడిన తర్వాతి రోజు నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన హెచ్డీఎఫ్సీ ద్వయంకు కొనుగోలు మద్దతు లభించడం, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఫలితాల తర్వాత భారీగా తగ్గిన ఐటీ షేర్లలో సైతం కొనుగోళ్లు జరగడంతో సూచీలు కోలుకోగలిగాయని ట్రేడర్లు తెలిపారు.
అయితే అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు కుదటపడేవరకూ, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి తగ్గేంతవరకూ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. గత రాత్రి అమెరికా స్టాక్ సూచీలు పెరగడం కూడా ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురికొల్పింది. అలాగే రూపాయి మారకపు విలువ భారీగా పెరగడం సెంటిమెంట్ను బలపర్చింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 29 పైసల మేర లాభపడి 76.21 వద్ద ముగిసింది.
సెన్సెక్స్-30 షేర్లలో 20 షేర్లు లాభాలతో ముగియగా, అత్యధికంగా అల్ట్రాటెక్ సిమెంట్ 3.52 శాతం పెరిగింది. అయితే స్టాక్ సూచీలు పెంచుకున్న మొత్తం పాయింట్లలో సగం హెవీవెయిట్ షేరు రిలయన్స్తోనే లభించాయి. ఈ షేరు 3 శాతం ఎగసి, 2,718 వద్ద ముగిసింది. ఏషియన్ పెయింట్స్, మారుతి, టీసీఎస్, భారతి ఎయిర్టెల్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీలు 1.5-3 శాతం మధ్య పెరిగాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఐటీసీ, ఎల్ అండ్ టీలు 3.35 శాతం వరకూ తగ్గాయి.
రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఆటోమొబైల్ సూచి అన్నింటికంటే ఎక్కువగా 2.21 శాతం లాభపడింది. ఎనర్జీ (2.19 శాతం), ఆయిల్ అండ్ గ్యాస్ (1.85 శాతం), టెలికం ఇండెక్స్ (1.40 శాతం)లు సైతం పెరిగాయి. మెటల్, యుటిలిటీ, బ్యాంక్ ఇండెక్స్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి.