బాల్యానికి బంగరు కానుక
అరవై ఏండ్ల తర్వాత తిరిగి నన్ను నా బాల్యంలోకి నడిపించుకుంటూ తీసుకెళ్లింది ఈ పుస్తకం. అప్పటి అమాయకత, అపరిపక్వ ఆలోచనలు, సంభ్రమాశ్చర్యాలు, భావోద్వేగాలు, భయాలు, సంతోషాలు అన్నింటినీ తిరిగిచ్చింది ఈ పుస్తకం.‘చందమామ కథలు’ (ఐదో భాగం) గురించి ఈ ఉపోద్ఘాతం. బాల కథారచయితగా ఎదిగిన మాచిరాజు కామేశ్వరరావు ’చందమామ’లో రాసిన కథలే ఇవన్నీ! అలనాటి ‘చందమామ’ గెటప్లోనే, అలాంటి రంగు రంగుల బొమ్మలతోనే క్రౌన్ సైజులో అలంకరించిన ఈ పుస్తకంలో 45 కథలు ఉన్నాయి. దాదాపు అన్నీ పిశాచాలు, దయ్యాలు, రాక్షసులతో కూడిన కథలే అయినా ఇప్పటికీ మనకు ఎబ్బెట్టుగా అనిపించకపోవడం వాటి గొప్పతనం. హాయిగా చదివేస్తాం. పిల్లల కథలు అంటే ఏవో గాలి పోగుచేసి రాయడం కాక ప్రతికథలోనూ ఒకనీతి, ఒక రీతి.. ప్రతికథలోనూ మనిషి మనస్తత్వం చిత్రికపట్టడం వలన అవి ఇప్పటికీ కొత్త కథల్లానే అలరిస్తాయి. ఏ ఒక్క కథా మనను నిరాశ పరచదు. ఇందులో ఈ కథ బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పడానికి మనకు అవకాశమే లేదు. అన్నీ కలకండ పలుకులలాంటి కథలే. అప్పటి ‘చందమామ’ కథలను రచయితల వారీగా సంకలనాలు తీసుకొస్తున్న జేపీ పబ్లికేషన్స్ వారిని అభినందించాల్సిందే.
– చంద్ర ప్రతాప్, 8008143507
చందమామ
కథలు -5
రచన: మాచిరాజు కామేశ్వరరావు
పేజీలు: 144; వెల: రు. 300/-
ప్రతులకు: ఫోన్ : 0866-2439464
సరళ.. మాల్యద!
ఆముక్త మాల్యద.. తెలుగు ప్రబంధాలకు తలమానికం. పంచమహా కావ్యాల్లో ఒకటి. సాహితీ సమరాంగణ సార్వభౌముడు కృష్ణదేవరాయల రచన ఇది. ఆంధ్రభోజుడి కళింగ జైత్రయాత్ర సమయంలో.. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు స్వప్న సాక్షాత్కారమిచ్చి.. ఓ మహాకావ్య రచనకు పూనుకోమని ఆనతిచ్చాడు. ఇతి వృత్తమూ తనే ఇచ్చాడు. గోదాదేవి నాయిక, జగన్నాయకుడైన శ్రీమహావిష్ణువు కథా నాయకుడు. అలౌకిక శృంగారం అంతర్లీనంగా ప్రవహిస్తుంది. ఆ రచనకు బాలాంత్రపు వేంకట రమణ చేసిన సరళ సుబోధక పరిచయమిది. మూల కావ్యంలోని ఎనిమిది వందల పైచిలుకు పద్యాలలో.. ముఖ్యమైన నాలుగు వందల పద్యాలను ఎంచుకొన్నారు
రచయిత. ప్రతి పదానికి అర్థం ఇచ్చారు. పాఠకుడి సౌలభ్యం కోసం అదనపు విశేషాలనూ జోడించారు. నేటి యువతకు తెలుగు భాష ఔన్నత్యాన్ని అందించాలన్నదే తన ఉద్దేశమని చెబుతారు రచయిత. ఆ ప్రయత్నంలో సఫలత సాధించినట్టే.
ఆముక్త మాల్యద – పరిచయము
రచన: బాలాంత్రపు వేంకట రమణ
పేజీలు: 340; వెల: రూ.300
ప్రతులకు: 8558899478
వి‘శ్లేష’ణాత్మక రచన
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత. ఆ నోటి మాట నోటు రాతంత నిఖార్సుగా ఉంటే ఎవరికి గొప్ప! నలుగురినీ నవ్వించే నాలుగు మాటలు మాట్లాడగలిగితే కదా నిజమైన ఆనందం. యాసతో, ప్రాసతో సందర్భోచితంగా మాట్లాడగలిగే వాళ్లు ఎక్కడున్నా చుట్టూ పదిమంది చేరిపోతారు. కారణం.. ఆ కాసేపైనా పన్నీటి జల్లులాంటి ఫన్మాటలు పంచ్తాడని. అలాంటి మాటకారి ఎలనాగ రాసిన పుస్తకమే ‘పన్’నీటి జల్లు. పదాల్లో విరుపులు, మాటల్లో కిటుకులు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ప్రతి మాటనూ కొత్తగా ఆవిష్కరించారు. దోమలు ఇంట్లోకి రాకపోవడం ‘జాలి’ వల్లనే!, పందెం కాసేటప్పుడు అంత ‘బెట్ట’యితే ఎలా?, నీ‘వెదురొ’స్తేనే మురళి తయారయ్యేది, పంద్రాగస్టునాడు మా బాసు ‘ధ్వజ’మెత్తుతాడు.. ఇలా సరళమైన వాక్యాల్లో సునిశితమైన హాస్యాన్ని పండించారు రచయిత. ప్రతి పన్నీటి జల్లు వెనుక పదాల్లోని విరుపులను, పట్టువిడుపులను, అర్థాలను వివరించిన తీరు పాఠకులకు ఉపయుక్తం అవుతుంది. ఈ పుస్తకాన్ని పట్టుకుంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి అనడంలో సందేహం లేదు. శ్లేషాత్మక చమత్కార బాణాలు వెంటనే అర్థమైతే పెదవులపై నవ్వులు విరుస్తాయి. వెనుక పేజీలు చదివాక.. ఇందులో ఇంత లోతైన అర్థముందా? అన్న ఆశ్చర్యం కలగక మానదు.
‘పన్’నీటి జల్లు (శ్లేషాత్మక చమత్కారికలు)
రచన: ఎలనాగ
పేజీలు: 154, వెల: రూ.125
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
బుక్ షెల్ఫ్
ఊట (ఖండకావ్యం)
రచన: డాక్టర్
లింగనబోయిన
లేఖానందస్వామి
పేజీలు: 112
వెల: రూ. 125
ప్రతులకు: రచయిత,
ఫోన్- 94414 65165, ప్రముఖ పుస్తక కేంద్రాలు
తెలుగు పద్యనాటకరంగంలో
శ్రీ జి.యస్.యన్.శాస్త్రిగారి కృషి