హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘పుస్తకం అమ్మ వంటిది. పుస్తకాలు చదివితేనే జ్ఞానం సంపాదించగలం, కొత్తది నేర్చుకోగలం, రాయగలం, మన చర్రితను తెలుసుకోగలం.. కాపాడుకోగలం. సామాజిక పరిణామ క్రమం తెలియాలంటే సాహిత్యాన్ని చదువాలి. పుస్తక పఠనం విలువను రేపటి పౌరులకు తెలియజెప్పడమే లక్ష్యంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నాం’ అని బుక్ ఫెయిర్, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ చెప్పారు.
రాబోయే తరానికి, భవిష్యత్తు సమాజానికి వంతెనగా పుస్తకం ఎప్పుడూ కీలకపాత్ర పోషిస్తూనే ఉంటుందని తెలిపారు. సాహిత్య వంతెనలు ఎంత బాగా ఉంటే.. అంత సునాయాసంగా జ్ఞాన వంతెనపై ఉత్తమ సమాజం నిర్మితమై కొనసాగుతుంటున్నదని చెప్పారు. ఈ నెల 22 నుంచి వచ్చేనెల ఒకటి వరకు ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహించనున్న నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’కు మంగళవారం ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రత్యేకతలు ఏమిటి?
రాష్ట్రంలోని 60 లక్షల మంది పాఠశాల విద్యార్థులతోపాటు కళాశాలలు, వర్సిటీల విద్యార్థులకూ ప్రదర్శన సమాచారం చేరవేశాం. వీళ్లే కాకుండా కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులకు కూడా పుస్తక ప్రదర్శనపై విస్తృత ప్రచారం కల్పించాం. అన్నివర్గాల వారికి సంబంధించిన పుస్తకాలు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయి.
పుస్తక ఆవిష్కరణలు, సాహిత్య చర్చలు వంటి కార్యక్రమాలు ఉంటాయా?
ప్రాచీన సాహిత్యం మొదలుకొని ఆధునిక రచనలు, కళలు, నవలల ధోరణి, తెలుగు అనువాద సాహిత్యంపై ప్రతిరోజు చర్చలు కొనసాగుతుంటాయి. పుస్తకావిష్కరణలు కూడా ఉంటాయి. బుక్ఫెయిర్కు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా దక్షిణ రాష్ర్టాల నుంచి సాహితీప్రియులు వస్తారు. ఈసారి సుమారు 10 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నాం.
పుస్తక ప్రదర్శనకు నాడు, నేడు ప్రభుత్వాల ప్రోత్సాహం ఎట్లా ఉన్నది?
తెలంగాణ ఏర్పాటు తర్వాత.. పుస్తక ప్రదర్శనను ప్రభుత్వం వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. సీఎం కేసీఆర్ స్వతహాగా సాహితీ ప్రియుడు కాబట్టి నామినల్ ఫీజు కూడా లేకుండా తెలంగాణ కళాభారతిని కేటాయించి పుస్తక పండుగను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు రూ.1 లక్షల నుంచి 2 లక్షలు వసూలుచేసేవి.
పుస్తకాలన్నీ డిజిటల్ అయినందున పుస్తక ప్రదర్శనపై ప్రభావం ఉంటుందా?
డిజిటలైజ్, పీడీఎఫ్, గూగుల్లో ఒక్క క్లిక్ చేసినా బోలెడు సమాచారం వస్తుంది. కానీ, వీటిని మించింది పుస్తకం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డ ఎంత కుశలంగా ఉంటుందో పుస్తకం పట్టుకొని చదివే వారు కూడా అదేవిధంగా ఫీల్ అవుతారు. పుస్తకం కన్నతల్లి వంటిది. పుస్తకాలు చదివితేనే.. రాయగలం. మన చర్రితను తెలుసుకోగలం.. కాపాడుకోగలం. సామాజిక పరిణామ క్రమం తెలియాలంటే సాహిత్యాన్ని చదువాల్సిందే.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత భాష.
యాస, సంస్కృతి, సంప్రదాయంపై వచ్చిన సాహిత్యం ఏమిటి?
రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో తెలంగాణ సాహిత్యం కొంత తక్కువగా ఉండేది. 2015 నుంచి మన ప్రాంత సాహిత్యం, భాష, యాస, నుడికారాలతో కూడిన అనేక పుస్తకాలు వచ్చాయి. కళలు, ఉద్యమం, సకలజనుల సమ్మె లాంటి ఉద్యమ ప్రస్థానం కలిగిన పుస్తకాలు వచ్చాయి. ముఖ్యంగా నలిమెల భాస్కర్ రాసిన తెలంగాణ పదకోశం (డిక్షనరీ) ప్రముఖ స్థానంలో నిలిచింది. బాణం అనే పుస్తకం గురించి ఇంటర్ సిలబస్లో పాఠ్యాంశంగా పెట్టారు.
బుక్ ఫెయిర్లో సాహిత్య పుస్తకాలకే ప్రాధాన్యం ఉంటుందా ?
జ్ఞాన తెలంగాణ నిర్మాణంలో భాగంగా అన్ని రంగాల పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. పోటీ పరీక్షలు మొదలుకొని మెడిసిన్, ఫార్మసీ, ఇంజినీరింగ్ తదితర అంశాల్లో పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. స్కూల్ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నాం. ముఖ్యంగా జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి పుస్తక ప్రదర్శన తన వంతు పాత్రను పోషిస్తుంది. జ్ఞానానికి ఒక పనిముట్టుగా పుస్తక ప్రదర్శన ఏమాత్రం దోహదపడ్డా లక్ష్యం నెరవేరినట్టుగా భావించాలి.
ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత సంక్షేమం-అభివృద్ధిపై వచ్చిన రచనలు ఉన్నాయా ?
చాలా పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యమ నాయకుడు సీఎం అయ్యారు. అదే స్ఫూర్తితో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో సీఎం కేసీఆర్పై నేను, జ్వాలా నర్సింహారావు, మనోహరాచారి వంటి వారు అనేక పుస్తకాలు రాశారు. ముఖ్యంగా ఎనిమిదేండ్లలో జరిగిన అభివృద్ధిపై వివరణాత్మక, విశ్లేషణలతో కూడిన సాహిత్యం వచ్చింది. దళిత బంధు, పల్లె ప్రగతి-పట్టణ ప్రగతి, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి అనేక అంశాలపై పుస్తకాలు వచ్చాయి. కేసీఆర్ కీలక ప్రసంగాలపై కూడా అనేక రచనలు వెలువడ్డాయి. వీటికోసం ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి బుక్స్టాల్ ఉంటుంది..