హుజూరాబాద్: తాను ఎంపీగా ఉండగా మంజూరు చేయించిన హుజూరాబాద్ మీదుగా ఖాజీపేట – కరీంనగర్ రైల్వేలైన్ రద్దైందని, దీనిపై కనీసం మాట్లాడని బండి సంజయ్కి ఓటడిగే హక్కు ఎక్కడిదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. ఎంపీగా బండి సంజయ్ పట్టించుకోకున్నా ఆ రైల్వేలైన్ ఏర్పాటుకోసం తాను ప్రయత్నిస్తానని చెప్పారు. హుజూరాబాద్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వినోద్కుమార్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రజలెవరూ ఆందోళనపడొద్దని సూచించారు. ఈ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని కోరారు. హుజూరాబాద్ సమస్యలన్నింటినీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
హుజూరాబాద్-జమ్మికుంట పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని, ఈ రెండు పట్టణాలతో కరీంనగర్కు సుడా లాగా అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వినోద్కుమార్ వెల్లడించారు. తాను ఎంపీగా ఉండగా బావుపేట దగ్గర ఆర్ఓబీకి ప్రతిపాదన పెట్టానని, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ దాని ఊసే ఎత్తడం లేదన్నారు. సీఎం కేసీఆర్తో ఐదేళ్లనుంచి గ్యాప్ వచ్చిందని ఈటల రాజేందర్ అంటున్నారని, మరీ ఐదేళ్ల కిందటే ఈ గ్యాప్ గురించి ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. ఈటల ఏదో మనసులో పెట్టుకుని ఐదేళ్లనుంచి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని, ఆయన బాధను నియోజకవర్గ ప్రజల బాధగా మలుస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ సభ, సమావేశాల్లో మాట్లాడినా హుజూరాబాద్ను అభివృద్ధి చేస్తానని ఈటల చెప్పడం లేదని వినోద్కుమార్ పేర్కొన్నారు. ఎప్పుడూ టీఆర్ఎస్ను విమర్శించడం తప్ప..ప్రజల కోసం ఏం చేస్తాడో చెప్పడం లేదన్నారు. హుజూరాబాద్ ప్రాంతంలో వరి ఎక్కువగా పండుతుందని, ఇక్కడ పుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీలు పెంచేలా ఆలోచన చేస్తున్నామని వినోద్కుమార్ వెల్లడించారు. హుజూరాబాద్ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తే అభివృద్ధి, సంక్షేమం గురించి తాము చూసుకుంటామన్నారు.