Tehran | పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధం.. రోజురోజుకూ మంటల్లోకి మారుతున్నది. టెహ్రాన్ చమురు నిక్షేపాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపించాయి. రాజధాని వీధులు లావా ప్రవాహాలను తలపించాయి. ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇరాన్ కూడా తన దూకుడు తగ్గించడం లేదు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై భీకర దాడులు జరిపింది. బహ్రెయిన్లోని నేవీస్థావరంపై జరిపిన దాడిలో 21మంది అమెరికన్ జవాన్లు మృతిచెందారు. ఒకవైపు గ్రౌండ్ ఆపరేషన్కు అమెరికా సిద్ధమవుతుండగా, ట్రంప్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ మిలిటరీ చీఫ్ ప్రకటించారు.
టెహ్రాన్, మార్చి 8: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. రాజధాని టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. చమురు డిపోలే లక్ష్యంగా భీకర దాడులు జరిపింది. దీంతో పలుచోట్ల భారీగా మంటలు చెలరేగాయి. నగరమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈ దాడుల్లో ఇద్దరు ట్యాంకర్ డ్రైవర్లు సహా నలుగురు మరణించారని నేషనల్ ఇరానియన్ ఆయిల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఈవో తెలిపారు. ఇంతటితో అయిపోలేదని, ఇరాన్కు మరిన్ని షాక్లు ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. టెహ్రాన్, దాని చుట్టుపక్కల ఉన్న చమురు డిపోలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు శనివారం రాత్రి చక్కర్లు కొడుతూ బాంబుల వర్షం కురిపించాయి. దీంతో భారీ పేలుళ్లు నగరాన్ని వణికించాయి. దట్టంగా ఎగసిపడ్డ మంటలు, నల్లటి మేఘంలా అలుముకున్న పొగ పలుచోట్ల కన్పించింది. పొరుగున ఉన్న కరజ్లో కూడా మంటలు, పొగ కన్పించిందంటే దాడుల తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
అగ్నినదిలా టెహ్రాన్ వీధులు
ఈ దాడులతో లీకైన చమురు రోడ్ల వెంబడి ప్రవహించగా, ఆయా డిపోలు మండుతున్న గోళాలను తలపించాయి. లీకైన చమురుకు పలుచోట్ల నిప్పు అంటుకోవడంతో వీధులు ప్రవహించే ‘అగ్ని నది’లా మారాయని పలువురు పేర్కొన్నారు. షహ్రాన్, అఘ్ధాసియేతో పాటు మొత్తం నాలుగు చమురు డిపోలు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా కేంద్రం కూడా వైమానిక దాడుల్లో దెబ్బతిన్నాయి. మంటలను ఆర్పేందుకు అత్యవసర బృందాలు రాత్రి నుంచి ప్రయత్నించి ఎట్టకేలకు సఫలమయ్యాయి. చమురు సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి మంటల నుంచి వెలువడిన పొగ నగరమంతా నల్లగా కమ్మేసింది. సూర్యుడు సరిగ్గా కన్పించ లేదని, గాలిలో మండుతున్న ఇంధన వాసన వ్యాపించిందని స్థానికులు తెలిపారు. అయితే దాడులను అధికారులు నిర్ధారించినప్పటికీ, తమ చమురు నిల్వలు మాత్రం సురక్షితంగా ఉన్నాయని ప్రకటించారు.

విషపూరిత ఆమ్ల వర్షం
దాడుల తర్వాత నగరంలో నల్లటి నీటితో వాన కురిసింది. ఇంధనాన్ని మండించడం వల్ల ఏర్పడే చమురు, మసితో వర్షపు నీరు కలవడంతో నల్లటి వర్షపు నీటి వాన కురిసి ఉండవచ్చునని సీఎన్ఎన్ తెలిపింది. ఆయిల్ డిపోల పేల్చివేత కారణంగా టెహ్రాన్లో ఆమ్ల వర్షం కురిసే ప్రమాదముందని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ హెచ్చరించింది. పేలుళ్ల కారణంగా చమురు భారీగా మండిపోయి గాలిలో భారీగా విషపూరిత హైడ్రో కార్బన్ మూలకాలు, గంధం, నైట్రోజన్ ఆక్సైడ్లు చేరాయని తెలిపింది. ఈ సమయంలో కురిసిన వాన చాలా ప్రమాదకరం, అత్యంత ఆమ్లంతో ఉంటుందని, ఈ నీటిలో తడిస్తే శరీరం బొబ్బలెక్కి గాయాలు ఏర్పడటంతో పాటు ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఇలాంటి పరిస్థితుల్లో పౌరులు ఇళ్లలోపలే ఉండాలని ఇరాన్ పర్యావరణ అధికారులు హెచ్చరించారు.
వారిపై దాడికీ వెనుకాడం
ఇరాన్లోని చమురు కేంద్రాలు లక్ష్యంగా తాము వైమానిక దాడులు చేసిన విషయాన్ని ఇజ్రాయెల్ నిర్ధారించింది. ఇరాన్ మిలిటరీ చమురును ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా వాటిని లక్ష్యంగా చేసుకున్నట్టు ప్రకటించింది. ‘ఖమేనీ వారసుని ఎంపిక చేసేందుకు నిపుణుల అసెంబ్లీ సమావేశమవుతున్నది. వారసుని ఎంపిక కోసం జరిగే సమావేశానికి హాజరయ్యే వారిని లక్ష్యంగా చేసుకునేందుకు మేం ఎంతమాత్రం వెనుకాడం’ అని హెచ్చరించింది.
ఇరాన్పై గ్రౌండ్ ఆపరేషన్!
ఇరాన్పై గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచిస్తున్నారట. ఇరాన్లో శుద్ధి చేసిన యురేనియం నిల్వల స్థావరాల్ని కనుగొనేందుకు అక్కడికి అమెరికా, ఇజ్రాయెల్ బలగాల్ని పంపాలని ట్రంప్ భావిస్తున్నారని తెలిసింది. పరిమిత సంఖ్యలో మిలిటరీని అక్కడికి పంపి ‘గ్రౌండ్ ఆపరేషన్’ చేపడితే ఎలా ఉంటుందని ఉన్నతాధికారులతో ట్రంప్ ప్రైవేట్గా చర్చలు సాగించారని ఎన్బీసీ న్యూస్ పేర్కొన్నది. భూగర్భంలో దాచిపెట్టిన యురేనియం నిల్వల్ని కనుగొనేందుకు, ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ చేపట్టాలని, ఇందుకు గల సాధ్యాసాధ్యాలపై ఇజ్రాయెల్, అమెరికా చర్చిస్తున్నట్టు తెలిసింది. దీనిపై ట్రంప్ సన్నిహిత వర్గాలు, రిపబ్లికన్లను ఉటంకిస్తూ ఒక నివేదిక విడుదలైంది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలతో ఇరాన్ అణు బాంబును తయారు చేయవచ్చని అమెరికా ఆందోళన చెందుతున్నది