వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapally Vinod Kumar ) , హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడిత సతీష్కుమార్ అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి , సూరారం గ్రామంలో రూ. కోటి 65 లక్షలతో బ్రిడ్జ్ నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) గ్రామాలాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామని పేర్కొన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు. అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి, జాతి నిర్మాణానికి అంబేద్కర్ చేసిన కృషిని మరువలేమని అన్నారు.
దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు గ్రామాలలో సామాజిక భవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందని వివరించారు. హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ నెలకొల్పారని, రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు ఎంతో వెనుకబాటులో ఉండేవని అన్నారు . ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుదీర్ కుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.