హుజూరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఎన్జీవో పాత్ర మరవలేనిదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. పట్టణంలోని కొత్తపల్లిలో సోమవారం ఆయన టీఎన్జీవో రిటైర్డ్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969 ఉద్యమం ప్రారంభమైన తర్వాత పాలకుల ఒత్తిడితో ఉద్యమం చల్లారిందన్నారు. అయితే ఆ సమయంలో టీఎన్జీవో నాయకులు ముందడుగు వేయడంతో తెలంగాణ ఆశయ సాధన కొన ఊపిరితో ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీఎన్జీవో సంఘం ఉండగా దీనికి భిన్నంగా తెలంగాణ ఉద్యోగులు టీఎన్జీవో ఏర్పాటు చేయడమనేది ఉద్యమ స్ఫూర్తిని అలాగే మిగిలిచిందన్నారు. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాక టీఎన్జీవో విశ్రమించలేదన్నారు.
రాష్ట్ర సాధనలో కేసీఆర్ సమయ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవి అని కొనియాడారు. అప్పటి ప్రభుత్వంలో భాగస్వాములు కావడంతో కొందరి నుంచి విమర్శలు వెల్లువెత్తాయన్నారు. వారి కారు, పెట్రోల్తోనే రాష్ట్రం సాధించాలని కేసీఆర్ ఒకటే మాట చెప్పేవారని, దీనికనుగుణంగా ఢిల్లీలో నాయకులను కలిసేందుకు ప్రభుత్వం ఇచ్చిన కారు ఎంతో ఉపయోగించుకొని ఆచరణలో పెట్టారన్నారు. ఈటల రాజేందర్ ఆత్మగౌరవానికి ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. తన ఆత్మగౌరవాన్ని ప్రజల మీద రుద్దుతూ సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని వినోద్ కుమార్ అన్నారు.
ఇప్పటి వరకు ఆయన ఎందుకు రాజీనామా చేసిండో ప్రజలకు చెప్పలేదన్నారు. ప్రజల మధ్య చిచ్చు రగిలించి ఓట్లు దండుకునేందుకు రాజేందర్ కుట్రలు చేస్తున్నారన్నారు. ఒక నదిని ఎత్తిపోయడం అనేది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి చూపించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. హింస లేకుండా స్వాతంత్య్రం సాధించిన మాదిరిగానే కేసీఆర్ రాష్ట్రాన్నిసాధించారని కొనియాడారు. ఈ సమావేశంలో టీఎన్జీవో రాష్ట్ర నాయకుడు దేవిశ్రీప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్కుమార్, టీఎంయూ రాష్ట్ర నాయకుడు థామస్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి హమీద్, నాయకులు హన్మంత్గౌడ్, విష్ణుదాసు గోపాల్రావు, ఎర్రం పాపిరెడ్డి, ఐలయ్య, దత్తాత్రేయ, మందల భాస్కర్, మధు తదితరులున్నారు.
బీజీపీ నాయకుడు రాజేందర్ తన స్పీచ్లో ఏమి అంటున్నడు నేను ఇది చేసిన అది చేసిన అని, కానీ గెలిస్తే ఇది చేస్తా అని చెప్పడం లేదు. బీజేపీ పార్టీ జూటా పార్టీ, కూలగొడతా, అగ్గిపెడతా, బొంద పెడతా అంటూ తిట్లు తిడుతున్నరు. ఇది పేదవాళ్ల కడుపు నిండుతదాఅని బోయినపల్లి వినోద్కుమార్ ఈటలను విమర్శించారు.
ఆయన చేతిలో ఏం లేదు కనుక ఈ మాటలు మాట్లాడుతున్నరు. ఆయనకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఆవేశంలో, ఆవేదనలో తన పని అయిందని మాట్లాడుతున్నరు. అన్ని సర్వేల్లో గెల్లు గెలుపు ఖాయం ఖాయం అంటున్నరు. యువత అంతా గెల్లును, విద్యార్థి నేతను గెలిపిస్తమంటున్నరు. మహిళలు కేసీఆర్ కారుకే తమ ఓటు అంటున్నరు. మా హూజూరాబాద్కు మెడికల్ కాలేజీ వస్తే బాగుండు అని అడుగుతున్నరు. ఎంజీఎం లాంటి పెద్ద దవాఖానా వస్తే పేదలకు ఉచిత వైద్యం దొరుకుతుంది అంటున్నరు. ఇది గెల్లుతో సాధ్యం. మేం అంతా సీఎం దగ్గరకు వెళ్లి మెడికల్ కాలేజిసాధిస్తాం. ప్రతీ జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఇవ్వాలని సీఎం నిర్ణయించకున్నరని వినోద్ కుమార్ తెలిపారు.