ముకరంపుర, మార్చి 11: శాతవాహన యూనివర్సిటీలో సంచరిస్తున్న గుడ్డేలుగును పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు, రెస్క్యూ బృందం శుక్రవారం తీవ్రంగా శ్రమించారు. విశ్వవిద్యాలయం 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. పరిపాలనా భవనం, అతిథి గృహం, వసతి గృహాలు, తరగతి గదులు మినహా మిగిలిన ప్రాంతమంతా దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఎలుగుబంటిని బంధించడం పరీక్షగా మారింది. రాత్రి వేళ ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందోనని విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా అటవీ ప్రాంతాన్ని అధికారులు, సిబ్బంది, రెస్క్యూ బృందం జల్లెడ పట్టింది. బాలికలు, బాలుర వసతి గృహాల సమీపంలో గుట్టలు ఉన్నాయి. ఏపుగా పెరిగిన గడ్డి, దట్టమైన ముళ్లపొదలతో అటువైపు వెళ్లడానికి వీలులేని పరిస్థితి. దీంతో ఎలుగు సంచారం, ఆవాసాన్ని గుర్తించడం కష్టంగా మారింది. డ్రోన్తో పరిశీలించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అయితే బాలికల వసతి గృహం సమీపంలోని సీసీ కెమెరాలో గుడ్డేలుగు సంచరించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఇక్కడికి కొంత దూరంలో ఓ నీటి కుంట ఉంది. రాత్రి వేళ దాహార్తిని తీర్చుకోవడానికి గుడ్డేలుగు ఇటువైపు వచ్చి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. ఇదే ప్రాంతంలో పాదముద్రలను సైతం గుర్తించారు. ఎలుగుబంటిని సురక్షితంగా పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులతో పాటు వరంగల్ నుంచి వచ్చిన రెస్యూ బృందం పలు విధాలుగా ప్రయత్నిస్తున్నది. విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బంది బయట తిరగకుండా అప్రమత్తం చేశారు. వాకింగ్కు వచ్చే వారిని కట్టడి చేశారు. గుడ్డేలుగుతో ఎటువంటి హాని జరగకుండా పట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా బోన్ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు భావిస్తున్న రెండు ప్రాంతాలను గుర్తించారు. ఎటువైపు నుంచి వచ్చినా బోనులో చిక్కేలా ఏర్పాట్లు చేశారు. వీటిలో తేనెతో పాటు పల్లికాయ, ఇతర పదార్థాలు ఉంచారు. ఇక్కడ రేంజ్ అధికారి శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ రేంజ్ అధికారి నర్సింగరావు, బీట్ అధికారులు ఎండీ అజీముద్దీన్, ముజీబుద్దీన్, ఖాజానసీరుద్దీన్, వరంగల్కు చెందిన రెస్క్యూ బృందం సభ్యులు ఉన్నారు.