నందికొండ, జనవరి 24: ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం బీజేపీకి అస్సలు ఇష్టంలేదని, మోదీ సర్కార్ ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. సోమవారం నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కేంద్ర సర్వీసుల నిబంధనల మార్పునకు సవరణలను తెస్తున్నదని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కూడా బెదిరిస్తున్నదని ధ్వజమెత్తారు. అడ్డగోలు దీక్షలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు కరోనా నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో కూడా ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేసిన విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తించాలన్నారు. బండి సంజయ్ని పార్లమెంట్ సభ్యుడిగా గౌరవించకపోతే ప్రివిలైజ్ కమిటీకి వెళ్లవచ్చని, రాజకీయ వివాదాల్లోకి ప్రివిలైజ్ కమిషన్లను లాగడం సరికాదని హితవుపలికారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ను దూషిస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అధికారం కోసం పగటి కలలు కంటున్నారని, దేశంలో కాంగ్రెస్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నదని చెప్పారు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీడీపీ నిధులు రూ.150 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో 690 రెసిడెన్షియల్ పాఠశాలలు నడుపుతున్న ఘనత సీఎం కేసీఆర్దేనని, ఒక్కో విద్యార్థికి ఏటా రూ.లక్షా 25 వేల చొప్పున 5 లక్షల మందిపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది ప్రాథమిక పాఠశాలలో రూ.7,500 కోట్లతో ఇంగ్లిష్ మీడియం అమలు చేయనున్నారని స్పష్టంచేశారు.