న్యూఢిల్లీ: అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ఆప్, సాధ్యమైనన్ని సీట్లు సాధించి కింగ్ మేకర్లుగా నిలవాలని ప్రాంతీయ పార్టీలు.. గోవాలో తొలిసారిగా బహుముఖ పోరు నెలకొన్నది. 1999 నుంచి గోవాలో ఎన్నికలంటే కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండేది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాకతో పరిస్థితి మారింది. తృణమూల్ కాంగ్రెస్ గోవాలో ప్రాంతీయ పార్టీలతో జతకట్టడంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీకి సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గోవా ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు బలపరీక్షలా మారాయి.
2017లో కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు
2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 13 సీట్లు వచ్చాయి. అయితే ప్రాంతీయ పార్టీల సహకారంతో బీజేపీనే అధికారం చేపట్టింది. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ(3), గోవా ఫార్వర్డ్ పార్టీ(3), ముగ్గురు స్వతంత్రులు ప్రభు త్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వీరిని ఏకం చేయడంలో బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ కీలక పాత్ర పోషించారు. ఒక రకంగా చెప్పాలంటే గోవాలో బీజేపీ ఆయన వల్లే అధికారాన్ని చేపట్టింది. ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం వల్లే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఉండగా, మనోహర్ పారికర్ కుమారుడు బీజేపీకి ఎదురు తిరిగారు. పనాజీ సీటును ఆయనకు కేటాయించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
కాంగ్రెస్లో సగం కొత్త వాళ్లే
గోవాలో కాంగ్రెస్ కూడా అంతర్గతంగా సమస్యలను ఎదుర్కొంటున్నది. 2017లో పార్టీ నుంచి గెలిచిన 17 మందిలో 15 మంది పార్టీ మారారు. అందులో 13 మంది బీజేపీలోనే చేరారు. ప్రస్తుతం ఉన్న నేతల్లో టికెట్ రాని వాళ్లు రెబెల్స్గా మారుతున్నారు. పార్టీ సీనియర్ నేత ల్యూజినో ఫెలిరియో టీఎంసీలో చేరారు. బీజేపీ స్ట్రాంగ్ మ్యాన్ మైకేల్ లోబో కాంగ్రెస్లో చేరడం పార్టీకి సానుకూలాంశం.
అవినీతిరహిత పాలన అంటున్న ఆప్
2017లో ఆప్ 39 స్థానాల్లో పోటీ చేసింది. ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. కానీ, ఆ పార్టీకి 6.27% ఓట్లు వచ్చాయి. దీనికి తోడు ఢిల్లీలో తమ పాలనను చూసిన గోవా ప్రజలు తమకే ఓటేస్తారని పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ నమ్ముతున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తామంటున్నారు. మమత నేతృత్వంలోని టీఎంసీ, ప్రాంతీయ పార్టీ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో జతకట్టింది. ఈ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్నది కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుంది.
భయపెడుతున్న ఫిరాయింపులు
గోవాలో బీజేపీ ప్రభుత్వంపై అసమ్మతి ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు చీలిపోవడం ఆ పార్టీకి ధైర్యాన్నిస్తున్నది. బీజేపీ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, ఆప్, ప్రాంతీయ పార్టీల మధ్య చీలుతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు, పార్టీ ఫిరాయింపులు అన్ని పార్టీలను భయపెడుతున్నాయి. అదే సమయంలో ప్రజల్లో పార్టీల పట్ల వ్యతిరేకతకు కారణం అవుతున్నాయి. ఆప్ అభ్యర్థులందరి చేత.. ‘పార్టీ మారబోం’ అఫిడవిట్ల మీద సంతకాలు చేయించుకొన్నది. కాంగ్రెస్ కూడా ఇలాంటి ప్రతిజ్ఞలే చేయించింది.