గట్టుప్పల్, అక్టోబర్ 18: బీజేపీ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి అడుగడుగునా అడ్డగింతలు పెరిగిపోతున్నాయి. గట్టుప్పల్ మండలం అంతంపేటలో మంగళవారం రాజగోపారెడ్డిని నిలదీసిన ప్రజలపై తిట్ల దండకం అందుకున్నారు. రౌడీలను వెంటబెట్టుకొని వచ్చిన ఆయన.. ‘ఏయ్.. చిల్లర నా కొడుకులారా.. మా పిల్లగాళ్లకు పనిచెప్పాలా?’ అని బెదిరింపులకు దిగారు. మంగళవారం రాత్రి రాజగోపారెడ్డి అంతంపేటకు రాగానే కొందరు పలు అంశాలపై నిలదీయగా.. ‘ఇష్టమున్నోళ్లు ఉండండి.. ఇష్టం లేనోళ్లు వెళ్లిపోండి. వెళ్లిపో. నీ ప్రచారం నువ్వు చేసుకో. అంతేగానీ, ఇక్కడ డిస్టబ్ చేయకు. ఏయ్.. ఏ బాబు.. పోలీసులు ఏం చేస్తున్నరు. డిస్టబ్ చేస్తుంటే.. ఏయ్ గుంజుకుపోరి.. లేకుంటే మా పిల్లగాళ్లకు పని చెప్పాల్సి వస్తది. ఏయ్.. మర్యాదగా డిస్టబ్ చేయకుండా వెళ్లిపోర్రి. డిస్టబ్ చేయొద్దు. ఏయ్.. పోలీసోళ్లు వెంటనే వారిని ఖాళీచేపియ్యాలే. ఏ బాబు.. ఆయన ఎవరైతే రుమాలు చుట్టుకున్నాడో.. ఆయనను రెండు నిమిషాల్లోపే తీసుకెళ్లాలి లేకుంటే. మా వొళ్లు చూసుకుంటరు.. ఏయ్, నీ మర్యాద దక్కదురా నా కొడుకా.. ఏం తమాషాలు చేస్తున్నవా? ఏయ్.. ఇక్కనుంచి ఎల్లిపో.. తీసుకెళ్లండాయనని.. తమషా చేస్తున్నవా? ఈపంతా పగులగొడుత నా కొడకల్లారా.. నక్రాలు చేస్తే.. వాణ్ణి అక్కడ నుంచి వెళ్లగొట్టండి ఫస్ట్.. వెళ్లగొట్టండి.. ఏయ్ మీటింగ్ దగ్గర డిస్టబ్ చేస్తే మర్యాద ఉండదు.. పోనీ పాపంలే అనుకుంటే నక్రాలు చేస్తుండ్రు. 18 నెలల ముందు పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని కాళ్లముందుకు తీసుకొస్తే వీళ్లేం.. ఈ నా కొడుకు లేంది.చిల్లర నా కొడుకులు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా స్థానిక కాంగ్రెస్ నేతలు మండిపడి తిరగబడ్డారు. కోమటిరెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా సాయపడిన కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ను ఇలా విమర్శించడం తగదని హెచ్చరించారు. ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు ఎగబడటంతో ఇరుపార్టీల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు సర్దిచెప్పినప్పటికీ కాంగ్రెస్ నేతలు గో బ్యాక్ రాజగోపాల్ అంటూ అక్కడనుంచి వెళ్లేవరకు నినాదాలు ఆపలేదు. చివరకు రాజగోపాల్రెడ్డి వెళ్లక తప్పలేదు. ‘పోలీస్లూ.. తస్మాత్ జాగ్రత్త. మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని తరిమికొడతాం’ అని వ్యాఖ్యానించారు.