లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మంగళవారం మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్నోలో ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. లవ్ జిహాద్ కేసుల్లో దోషులకు పదేండ్ల జైలు శిక్షతో పాటు రూ లక్ష జరిమానా విధిస్తామని మ్యానిఫెస్టోలో స్పష్టం చేసింది. రైతులందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని, వరి, గోధుమకు మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చింది. యూపీలో చక్కెర మిల్లుల పునరుద్ధరణకు రూ 5000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమవడంతో రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తించాయి.
సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారం చేపట్టారు. బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మవద్దని ఎస్పీకే ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఆమె మంగళవారం లక్నోలో ఓటర్లకు పిలుపు ఇచ్చారు. కాషాయ పార్టీ కపట వాగ్ధానాలను నమ్మవద్దని, ఎస్పీకి ఓటు వేసి అధికారం అప్పగించాలని, బీజేపీని మట్టికరిపించాలని ఆమె కోరారు. ఇక అంతకుముందు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) గెలుపొందాలని కోరుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆకాంక్షించారు. కోల్కతాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు ఆదరిస్తే ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ విజయం సాధించే అవకాశం మెండుగా ఉందన్నారు.
ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి ఏడు వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలుపొంది పాలనా పగ్గాలు చేపట్టాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, యోగి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ఇక ప్రియాంక గాంధీ ఇమేజ్తో సత్తా చాటాలని కాంగ్రెస్ పావులు కదుపుతుండగా , దళితులు..అణగారిన వర్గాల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కసరత్తు సాగిస్తోంది.