ఎన్నికల ముందు కీలక నేతల రాజీనామాలతో ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు క్యాబినెట్ మంత్రులు సహా ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్బై చెప్పడం కాషాయ నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నది. మరికొద్ది రోజుల్లో డజను మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారన్న వార్తలు కమలదళంలో గుబులు రేపుతున్నది.
వచ్చే నెలలో యూపీ సహా ఐదు రాష్ర్టాల్లో జరుగనున్న శాసనసభ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ లాంటివి కావడం, ఇదే సమయంలో కీలక నేతలు పార్టీని వీడటం బీజేపీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బీజేపీ అధికారంలో ఉండగా.. పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న నాలుగు రాష్ర్టాల్లో గెలుపు నల్లేరు మీద నడకేనని ఇప్పటివరకూ భావించిన బీజేపీకి యూపీలో గత 24 గంటల్లో జరిగిన పరిణామాలు పెద్ద షాక్ ఇచ్చాయి. రాజీనామా చేసిన మంత్రులు ఇద్దరికీ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, తమ సామాజిక వర్గాల్లో బలమైన పట్టు ఉన్నది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరు పార్టీని వీడటం బీజేపీని అయోమయంలోకి నెట్టివేసింది.
ఇటు ఓబీసీ.. అటు దళితులు
బీజేపీకి రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్ ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారే. గతంలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీలో కీలక హోదాల్లో పనిచేశారు. దళిత, ఓబీసీ సామాజిక వర్గాల గట్టి మద్దతును కూడగట్టారు. అనంతరం బీజేపీలో చేరిన వీళ్లు ఆ మద్దతుని అలాగే నిలుపుకొన్నారు. 2017 ఎన్నికల్లో యూపీలో బీజేపీ అధికారంలోకి రావడంలో వీరి పాత్ర కీలకమని విశ్లేషకులు చెబుతారు. అయితే, దళితులు, వెనుకబడిన వర్గాలకు బీజేపీ అన్యాయం చేస్తున్నందువల్లే తాము మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆ వర్గాల్లో వీరిపై సానుభూతి పెరిగింది. యూపీ ఎన్నికలను ప్రభావితం చేసే ఓబీసీ ఓటర్లు రాష్ట్ర జనాభాలో 45% ఉంటారు. ఇందులో 9% యాదవులు. వీరి ఓట్లలో ఎక్కువ మొత్తం అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీకే వెళ్తాయి. మిగిలిన 36% నాన్ యాదవ్ ఓబీసీ ఓటర్లలో ఎక్కువ మంది మౌర్య, చౌహాన్కు మద్దతు తెలిపే అవకాశం ఉన్నది. ఎందుకంటే.. ఓబీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న కుషీనగర్, ప్రతాప్గఢ్, కాన్పూర్ దేహట్, బందా, షాజహాన్పూర్ జిల్లాల్లోని కనీసం 20 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల కీలక నేత మౌర్య. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఆ సామాజిక వర్గంపై గట్టి పట్టు ఉన్న నేతగా చౌహాన్కు పేరుంది. ఈయన పది, పదిహేను స్థానాల్లో ప్రభావం చూపగలరని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఇటీవల బీజేపీని వీడిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు ఎస్పీలో చేరారు. ఇందులో ముగ్గురు ఓబీసీలు, ఒకరు దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. వీరు కూడా ఆయా సామాజిక వర్గాల్లో గట్టి పట్టు నిలుపుకొంటూ ఐదారు స్థానాల్లో ప్రభావం చూపించగలిగే నేతలే.
అఖిలేశ్ వ్యూహాలు..
రాష్ట్ర జనాభాలో 10% వరకు ఉన్న దళితులు.. బీఎస్పీని కాదని.. ప్రత్యామ్నాయ పార్టీల వెంట నడిచే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. ఈ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొనే బీజేపీలో రేగిన ఓబీసీ తిరుగుబాటు బావుటాను తమకు అనుకూలంగా మలుచుకునే దిశగా అఖిలేశ్ వేగంగా పావులు కదిపారు. సామాజిక న్యాయం కోసం కలిసి పోరాడుదామంటూ మాజీ బీజేపీ కీలక నేతలకు స్నేహహస్తం అందించారు. తాజా చేరికలు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. యూపీ ఎన్నికలపై తాజా వలసలు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.