Amit Shah | తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ (రాహుల్/రేవంత్)టాక్స్ విధిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రం నుంచి కోట్ల రూపాయల టాక్స్లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగసభలో అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్, ఓవైసీ అంటే భయం ఉందని అన్నారు.
దేశంలో నక్సలిజంతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపడానికి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏండ్ల పాటు అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను కాంగ్రెస్ వారే మూయించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. నకిలీ వీడియో చేయించిన రేవంత్రెడ్డి .. ఢిల్లీ పోలీసులు తన వెంటబడుతున్నారని చెబుతున్నాడని అన్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే వారికి అదే గతిపడుతుందని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు.