సుబేదారి, జనవరి 27: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ రాజ్యాంగం ద్వారా సిద్ధించిన రిజర్వేషన్లను సైతం ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. గురువారం హనుమకొండ జిల్లా ఎక్సైజ్కాలనీలోని నివాసంలో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి మాట్లాడారు. గత ఎనిమిదేండ్లుగా దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించకుండా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ దళితుల బతుకులను రోడ్డుపాలు చేస్తున్నదని మండిపడ్డారు. దళితుల ఆహారపు అలవాట్లను నియంత్రిస్తూ దాడులు చేస్తూ అవమానపరుస్తున్నారని, దళితులపై బీజేపీ కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రానికి, బీజేపీకి దళితులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, దళితుల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపట్టాలని, దేశవ్యాప్తంగా దళితబంధును అమలుచేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమ కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.