వనపర్తి/భద్రాద్రి కొత్తగూడెం, మే 4 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉండి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో బహిరంగ సభ, వనపర్తి జిల్లా కొత్తకోటలో రోడ్డుషోలో ప్రసంగించారు. రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడినందుకు మోదీ, అమిత్షాలు కుట్ర చేసి తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిపారు. 70 ఏం డ్ల తర్వాత పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తిగా తనకు అవకాశం వచ్చిందని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి జరగాలంటే వంశీచంద్రెడ్డి, మల్లు రవిని ఎంపీలుగా గెలిపించాలని కోరారు. ఇక ఖమ్మం ప్రజలు చైతన్యవంతులని, దేశంలో అత్యధిక మెజార్టీతో ఖమ్మం ఎంపీగా రామసహాయం రఘురాంరెడ్డి గెలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఏబీసీడీ వర్గీకరణ, ముదిరాజ్, వాల్మీకుల రిజర్వేషన్ల సమస్యలు సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాలంటే కాం గ్రెస్ అభ్యర్థులను పార్లమెంట్కు పంపించాలని చెప్పారు. ఆగస్టు 15లోపు రుణమా ఫీ చేస్తానని కొత్తకోటలో కురుమూర్తి స్వామిపై ప్రమాణం చేశారు. కొత్తకోటలో స్థానిక ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి తన నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగూడెంలో జరిగిన సభలో ఎండకు తట్టుకోలేక ప్రజలు మధ్యలోనే ఇంటిముఖం పట్టారు. ఇది గమనించిన నాయకత్వం స్టేడియం మెయిన్ గేట్ ను బంద్ చేశారు. కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకాచౌదరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఆదినారాయణ, రాగమయి, తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం, సీపీఎం, ఎన్డీ నాయకులు పాల్గొన్నారు.