హుజూరాబాద్ టౌన్ : హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిద్దరిని ఆత్మహత్యకు పురిగొల్పి, టీఆర్ఎస్ పై విష ప్రచారం చేసి సానుభూతి ఓట్లు పొంది గెలుపొందాలని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు కొత్త డ్రామాకు తెరలేపారని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుధవారం హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటల మాయలో పడి అమాయకులు తమ ప్రాణాలను ఎవరికోసమో బలి పెట్టవద్దని సుమన్ సూచించారు. బీజేపీ నాయకులు ఎంతో జుగుప్సాకరంగా, నిస్సిగ్గుగా అబద్ధాలను గోబెల్స్ ప్రచారానికి మించి నమ్మించి ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు.
దళితులు ఆర్థికంగా ఎదిగేలా చేయుతనందించేందుకు దళితబంధు పథకం వర్తింప జేస్తుండగా, కావాలని ఒక లేఖ రాసి ఎన్నికల వేళ వచ్చిన డబ్బులు గ్రౌండింగ్ కాకుండా చేసిన బీజేపీ నాయకుల కుట్రలను దళిత సమాజం గుర్తించాలన్నా రు. ఒకే అబద్దాన్ని వందసార్లు చెప్పి నిజం చేయాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని సుమన్ ఆరోపించారు.
గతంలో కరెంట్ కట్ విషయం, గ్యాస్ ధరలో తెలంగాణ పన్ను విషయం, ఉప్పల్లో బాల్క సుమన్ కారుతో యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు చేయగా అది నిజం కాదని, దమ్ముంటే నిరూపించాలని మంత్రి హరీశ్రావు సవాల్ విసిరితే, ఇప్పటికీ ఆ సవాలును స్వీకరించలేదన్నారు. ఉప్పల్ లో కారు బీజేపీ నేత బండి సంజయ్ ముఖ్య అనుచరుడు విశ్వనాథ్ వినోద్ ది అని నిరూపించడంతో తోక ముడిచారన్నారు.
అలాగే ఈటల పాదయాత్ర పేరుతో కాలు నొప్పి పేరుతో, మోకాలు ఆపరేషన్ పేరుతో డ్రామాలు చేసేందుకు ప్రయత్నించి విరమించుకోవడం, తన కారుపై తానే దాడి చేయించుకొని, తనపై దాడి జరిగిందని కొత్త డ్రామాకు తెరలేపడం, బహిర్గతం కావడంతో విరమించుకోవడం, ఇలా రకరకాలుగా డ్రామాలాడుతున్న ఈటల రాజేందర్, బీజేపీ నాయకులకు నటనలో ఆస్కార్ అవార్డు దక్కుతుందన్నారు.
ఆత్మహుతి చేసుకునేలా కుట్ర..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈటల మళ్లీ ఒక కొత్త నాటకానికి తెరలేపడన్నారు. అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒకరిద్దరిని ఈటల కోసం ఆత్మహత్య చేసుకునేలా కుటుంబసభ్యులను డబ్బులతో ఒప్పించి, వారిని పురిగొల్పి టీఆర్ఎస్ పై విష ప్రచారం చేయించి, వారితో వీడియోలు తీసి, లేఖలు రాయించి వారి కుటుంబ సభ్యులతో చెప్పించేందుకు బీజేపీ, ఈటల కొత్త డ్రామాకు తెరలేపారన్నారు.
నియోజకవర్గంలోని ప్రజలు ఈటల, బీజేపీ నాయకుల ట్రాప్లో పడవద్దని, వారి మాయమాటలు, డబ్బులకు ఆశపడి ప్రాణాలను బలిపెట్టవద్దని బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెయ్యి- పువ్వు కలిసిపోయి బలహీనమైన, స్థానికుడుకాని అభ్యర్థిని చూసి కుట్ర రాజకీయాల్లో భాగంగా బల్మూరిని కాంగ్రెస్ తరఫున పోటీలో పెట్టి ఇక్కడ ప్రచారానికి రేవంత్రెడ్డి రాకుండా ఈటలకు నైతికంగా మద్దతు తెలుపుతున్నాడన్నారు.
అలాంటి వారికి ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఓటుతో వారికి రాజకీయ సమాధి కట్టాలన్నారు. రాజకీయాల్లో ఎన్నికలు వస్తాయని, పోతాయని, కానీ ప్రజల ప్రాణాలతో రాజకీయాలను చేయడం సరికాదని, బీజేపీ వారి కుట్రలను తరిమికొట్టడం కోసం ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు. గెల్లు శ్రీనివాస్ను గెలుపించాలని పిలుపు నిచ్చారు.
ఆత్మహత్యకు ప్రేరేపించడంపై చర్యలు తీసుకోవాలి : డీజీపీకి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విజ్ఞప్తి
మిడిమిడి జ్ఞానంతో బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఎలాగైనా గెలవాలని, అమాయక నిరుపేద ప్రజలను ఆత్మహత్య లకు ప్రేరేపించడాన్ని నేరంగా పరిగణించి రాష్ట్ర డీజీపీ చట్ట ప్రకారం బీజేపీ వారిపై కేసులు పెట్టి, తగిన చర్యలు తీసుకోవా లని అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ చేస్తున్న కుట్రలను పోలీసులు, ప్రజలు చైతన్యవంతమైన ఓటర్లు పసిగట్టాలని ఆయన సూచించారు.
అక్రమంగా, అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బులతో బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఏదైనా చేయవచ్చన్న అహంకారం తో రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ఓటర్లను డబ్బుతో కొని, ప్రజలను గందరగోళానికి గురి చేసి, ఆత్మహత్యలకు పురిగొల్పి లబ్ధి పొందాలని చూస్తున్న ఈటల నీచ రాజకీయాలకు ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు.
దళితులన్నా.. దళిత ప్రజాప్రతినిధులన్నా ఈటలకు చిన్నచూపు : చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
దళితులన్నా.. దళిత ప్రజాప్రతినిధులన్నా బీజేపీ నాయకుడు ఈటలకు చిన్న చూపు అని, దళిత ఎమ్మెల్యేలపై ఇష్ట మొచ్చినట్లు మాట్లాడుతున్న ఈటల రాజేందర్ నిజమైన అసమర్థుడని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నా రు. ఎన్నికలు వస్తేనే పథకాలు వస్తున్నాయని ఈటల రాజేందర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆయనకు మెదడు మోకాల్లో ఉందని, అందుకే మోకాలు ఆపరేషన్ చేసుకున్నాడని ఎద్దేవా చేశారు.
గతంలో ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలు ఎన్నికలప్పుడు పెట్టినవేనా అని ప్రశ్నించారు. ఏం మాట్లాడు తున్నడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. దళితుల సంక్షేమం కోసం రూ.వెయ్యి కోట్లతో గత శాసనసభ సమా వేశాల్లోనే వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించినప్పుడు ఈటల మంత్రిగా ఉండి చప్పట్లు కొట్టి, నేడు తన వల్లే దళితబంధు వచ్చిందని చెప్పుకోవడం ఆయన వక్ర బుద్ధికి నిదర్శనమన్నారు.
మాల మాదిగలు అంటే ఈటలకు, ఆయన కుటుంబ సభ్యులకు వివక్ష, చిన్న చూపని, అతని బామ్మర్ది కూడా దళితులను కించపరుస్తూ ఆడియోలో అడ్డంగా దొరికాడన్న విషయాలు ప్రజలు మర్చిపోరన్నారు. దేశానికి దిక్సూచిగా మారిన సీఎం కేసీఆర్ను ఈటల, బీజేపీ నాయకులు తప్పుపట్టడం వారిలో ఉన్న అంధత్వానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి రేవంత్రెడ్డికి ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదని, అందుకే మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
దళితులను ఆత్మహత్యలకు పురిగొల్పడం హేయమైన చర్య : ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్
దళితులను ఆత్మహత్యలు చేసుకునేలా పురిగొల్పడం హేయమైన చర్యగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అభివర్ణించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మవద్దని, ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళితబంధు పథకం వచ్చే నెల నాలుగు నుంచి సీఎం కేసీఆర్ స్వయంగా పంపిణీ చేస్తారన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 17,500 కుటుంబాలకు దళితబంధు డబ్బులు గ్రౌండింగ్ చేశారని, మరో 2, 3 వేల మందికి ఎన్నికల అనంతరం గ్రౌండింగ్ చేసి ప్రతి కుటుంబానికి ఆర్థిక భోరోసా కల్పిస్తామన్నారు. ఈటల దళిత బాధితుల సంఘం ఇప్పటికే ఈటల చేసిన అన్యాయాలు, అక్రమాలపై గ్రామ గ్రామాన తిరుగుతూ దళితులను చైతన్య వంతులను చేస్తున్నదన్నారు.