పట్నా : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను యూపీలోని పూల్పూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని వచ్చిన వార్తలను బిహార్ సీఎం నితీష్ కుమార్ తోసిపుచ్చారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతపైనే తాను దృష్టి కేంద్రీకరించానని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పట్ల తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
యూపీలో ఏ స్ధానం నుంచి పోటీ చేసినా తాము మద్దతిస్తామని యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ నితీష్ కుమార్కు ఆఫర్ చేసినట్టు ఊహాగానాలు సాగాయి. పూల్పూర్ నుంచి నితీష్ కుమార్ పోటీ చేయాలని ఆ నియోజకవర్గానికి చెందిన జేడీ(యూ) శ్రేణులు నితీష్పై ఒత్తిడి తీసుకువచ్చినట్టు సమాచారం. పూల్పూర్ సహా మిర్జాపూర్, అంబేద్కర్ నగర్ నియోజకవర్గాల నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలవాలని నితీష్ కుమార్కు ఎస్పీ ఆఫర్ చేసినట్టు జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ పేర్కొనడం ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది.
అత్యధిక పార్లమెంట్ స్ధానాలున్న యూపీలో పైచేయి సాధించడం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల గెలుపునకు కీలకం. ప్రధాని నియోజకవర్గం వారణాసికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూల్పూర్ నుంచి నితీష్ కుమార్ను పోటీ చేయిస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని విపక్షాలు భావిస్తున్నాయి. యూపీ నుంచి నితీష్ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగితే యూపీలో 2024 లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పరిణామాల్లో కీలక మలుపు చోటుచేసుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.