ED-IT Raids | ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగాల్సి ఉన్నది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు బిహార్ సీఎం నితీశ్ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటికి ఒక రోజు ముందు బిహార్ బెసగురాయ్లో ఈడీ, ఐటీ దాడులు నిర్వహిస్తున్నాయి. నితీశ్ దగ్గరి మంత్రి విజయ్కుమార్ చౌదరికి సన్నిహితుడైన పారిశ్రామికవేత్త అజయ్ కుమార్ సింగ్ అలియాస్ కరోన్ సింగ్ ఇంటిపై దాడులు జరిగాయి. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వనాథ్ నగర్ ప్రాంతంలో దాడులు జరుగడంతో ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది.
ఉదయం 6 గంటల సమయంలో ఈడీ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు వచ్చారని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు సంప్రదించేందుకు ప్రయత్నించగా.. వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. మంత్రి విజయ్ చౌదరి బావమరిది నివాసంపై ఈడీ, ఐటీ అధికారులు దాడి చేశారని, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్కు ఆయన సన్నిహితుడని స్థానికులు పేర్కొన్నారు. ఈడీ, ఆదాయపన్ను శాఖల బృందం ఏడు వాహనాల్లో వచ్చారని, దాంతో మరో రహస్య స్థావరంపై సైతం దాడులు చేసినట్లు సమాచారం. రాడ్ల గోడౌన్లోనూ దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన ద్వారం వద్ద భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎవరినీ లోపలికి వెళ్లకుండా, బయటకు అనుమతించడం లేదు.