ములుగు, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ కిట్ పథకంతో తెలంగాణలో గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందుతున్నదని, సర్కారు దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్కుమార్ ప్రశంసించారు. బుధవారం నీతిఆయోగ్ ముఖ్య కార్యదర్శి కే రాజేశ్వర్రావు, సీనియర్ సలహాదారులు నీరజ్సిన్హా, సీనియర్ కన్సల్టెంట్ రాకేశ్రంజన్ తదితరులతో కలిసి ఆయన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించారు.
ములుగు జిల్లాకేంద్రంలోని ప్రేమ్నగర్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.46 లక్షలతో నిర్మించిన న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ను వారు ప్రారంభించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకు అందుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. అనంతరం ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన కలెక్టరేట్లో రెండు జిల్లాల అధికారులతో సమీక్షించారు. విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు అందుతున్న సేవలను కలెక్టర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృందానికి వివరించారు. 94 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్నట్టు తెలుసుకున్న నీతిఆయోగ్ బృందం.. అధికారులను ప్రశంసించింది.
ఈ సందర్భంగా రాజీవ్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు ప్రజల్లో నమ్మకం కల్పించి, సమాజానికి, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణతోపాటు మెరుగైన శిక్షణ అందించాలన్నారు. రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాలని కోరారు. కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, రెండు జిల్లాల అదనపు కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.
నాటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీక రామప్ప
అనంతరం ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. ఓరుగల్లును పాలించిన కాకతీయుల శిల్పకళ అద్భుతంగా ఉన్నదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ అన్నారు. నీటిలో తేలే ఇటుకలను పరిశీలించి, నాటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీకలు అని కొనియాడారు.