రైతు.. రైతులా ఉన్నంత కాలం కష్టాలు తప్పవు. నష్టాలు వదలవు. అదే భూమి, అదే విత్తు, అదే ఎరువు, అదే కోత, అదే ధర. కానీ, వ్యూహం మారాలి. పక్కా వ్యాపారవేత్తలా ఆలోచించాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మంగళపెల్లి నీలిమ అలాంటి ప్రయోగమే చేసింది. పోస్ట్ కొవిడ్ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని.. ఆకుకూరల పంటను ఎంచుకుంది. సేంద్రియ మార్గంలో నడిచింది. దళారీ వ్యవస్థకు తావులేకుండా, కొనుగోలుదారులనే పొలానికి పిలిపించుకుంది. సేద్యానికి వ్యాపార కోణం జోడించింది. కాబట్టే, ‘ఉత్తమ రైతు’ పురస్కారాలు ఆమెను వరిస్తున్నాయి.
మంగళపెల్లి నీలిమ.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఎస్సీ కాలనీకి చెందిన దళిత రైతు. తనకు సేద్యం అంటే ప్రాణం. ప్రయోగాలంటే ఇష్టం. ఫత్తేపురం శివారులో ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఎకరం పొలంలో పాలీహౌజ్ నిర్మించుకుంది. మొదట క్యాప్సికమ్, కీరదోస సాగు చేసింది. తొలి ఏడాదే అవరోధాలు ఎదురయ్యాయి. పెట్టుబడి ఎకువ, దిగుబడి తక్కువ. గిట్టుబాటు ధర కావాలంటే ఒకటే దారి. పంటను హైదరాబాద్ మారెట్కు తరలించాల్సిందే. ఆ రవాణా వ్యయాన్ని తట్టుకోవడం కష్టం. ఖర్చులన్నీ పోగా మిగిలేది నామమాత్రం. కొన్నిసార్లు ఆ చిల్లర పైసలూ దక్కకపోవచ్చు. అంతిమంగా అప్పుల కుప్పలే. ‘ఎన్నాళ్లిలా? ఎన్నేళ్లిలా?’ అనే ఆలోచన నీలిమను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ అంతర్మథనంలోంచి ఓ పరిష్కారం పుట్టుకొచ్చింది. స్థానికంగా గిరాకీ ఉన్న పంటలు పండించగలిగితే.. ఏ ఇబ్బందీ ఉండదని భావించింది నీలిమ. ఉన్న కాస్తంత భూమిలోనే సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టింది. సహజ ఎరువులు సిద్ధం చేసుకుంది.
‘ఆరోగ్య’ ఫార్ములా కరోనా తర్వాత చాలామంది శాకాహారం వైపు మళ్లుతున్నారు. ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. కాబట్టి, మార్కెట్లో తిరుగు ఉండదు. అదీ ఆర్గానిక్ పంట అయితే.. ఏకఛత్రాధిపత్యమే. దీంతో పాలీహౌజ్లో పాలకూర, మెంతి, గంగవాయిలి, తోటకూర, బచ్చలి, సుకకూర తదితర ఆకుకూరలు పండించడం మొదలుపెట్టింది నీలిమ. సేంద్రియ ఆకు కూరలు నాలుగు రోజులైనా తాజాగా ఉంటాయి. సహజసిద్ధమైన సాగు కావడంతో.. రుచి బాగుంటుంది. దీంతో డాక్టర్లు, టీచర్లు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు.. పొలం దగ్గరికే వచ్చి కొనుగోలు చేయడం ప్రారంభించారు. రవాణా ఖర్చు తప్పింది. మధ్య వర్తుల బెడద లేకుండాపోయింది. ఒక రూపాయి ఎక్కువైనా సరే, ఇక్కడే కొంటామన్నారు కస్టమర్లు.
ఆదాయం..
రోజుకు క్వింటాలు చొప్పున నెలలో 20 రోజులు ఆకుకూరలను కోసి అమ్ముతారు నీలిమ. క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఆదాయం వస్తుంది. పాలీహౌజ్లో రోజూ ఆరుగురు కూలీలు పనిచేస్తారు. ఖర్చులన్నీ పోగా నెలకు సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు మిగులుతుంది. నీలిమ పెద్దగా చదువుకోలేదు. కానీ పెండ్లి తర్వాత భర్త కృష్ణమూర్తి సహకారంతో ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం, అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నది. అలాగే, తెలంగాణలోని మహిళా ఆంత్రప్రెన్యూర్స్కు వీహబ్ ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నది. ప్రతిభకు, వినూత్న ఆలోచనా విధానానికి గుర్తింపుగా అనేక అవార్డులకు ఎంపికైంది. జిల్లా ఉద్యానశాఖ సహా వివిధ సంస్థల నుంచి ఉత్తమ రైతు అవార్డు స్వీకరించింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సంస్థ వారు ఇటీవల హైదరాబాద్లో వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభను కనబరుస్తున్న పదకొండు మంది మహిళలను సత్కరించారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లీ చేతుల మీదుగా ఉత్తమ మహిళా రైతు పురస్కారం అందుకున్నది. ‘ఎంతోమంది విజేతలు వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. అలాంటివారే నాకు ఆదర్శం’ అంటుంది నీలిమ.