బెంగళూర్ : పోటెత్తిన వరదతో బెంగళూర్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. జనావాసాలు నీట మునిగిన ప్రాంతాల్లో హోటళ్లకు గిరాకీ పెరిగింది. నగరంలోని పలు హోటళ్లు ఒక్క రాత్రికి సగటున ఏకంగా రూ 30,000 నుంచి రూ 40,000 వరకూ వసూలు చేస్తున్నాయి. అధిక ధర చెల్లించేందుకు సిద్ధమైన ప్రజలకు సరిపడా హోటల్ రూమ్లు దొరకడం లేదు.
ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో హోటల్ రూం కోసం ఒక్క రాత్రికి తాను రూ 42,000 చెల్లించానని ఓ టెక్నాలజీ కంపెనీ సీఈవో మీనా గిరిసబల్ల చెప్పారు. ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్, వైట్ఫీల్డ్, అవుటర్ రింగ్రోడ్, కోరమంగళ ప్రాంతాల్లోని పలు హోటళ్లు శుక్రవారం వరకూ పూర్తిగా బుక్ అయ్యాయి. పది నుంచి పదిహేను రోజుల వరకూ రూమ్లు బుక్ అయ్యాయని హోటల్ మేనేజర్లు చెబుతున్నారు.
ఇక భారీ వర్షాలతో బిలియనీర్లు ఉండే ప్రాంతాలు సైతం నీట మునిగాయి. విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ, బైజూస్ రవీంద్రన్, బ్రిటానియా సీఈవో వరుణ్ బెర్రీ వంటి దిగ్గజ బిలియనీర్లు ఉండే ఎప్పిలన్ గేటెడ్ కమ్యూనిటీ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బిలియనీర్లను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.