PM Modi | న్యూఢిల్లీ, మే 1: పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించడం ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యతను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం పన్నుల విధానానికి రూపకల్పన చేయాలి. పేదలపై పన్నుల భారం వీలైనంత తగ్గించే ప్రయత్నం చేయాలి. కానీ, పదేండ్ల మోదీ ప్రభుత్వ హయాంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతున్నది. పేదలు, మధ్య తరగతి ప్రజలపై మోయలేని పన్నుభారం పడుతున్నది. మరోవైపు కార్పొరేట్లకు పన్నుల భారం తగ్గుతున్నది. ఆదాయానికి తగ్గట్టుగా చెల్లించాల్సిన ప్రత్యక్ష పన్నులను కేంద్రం తగ్గిస్తున్నది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరిపైనా భారం మోపే పరోక్ష పన్నులను పెంచుతున్నది. ఫలితంగా పదేండ్ల మోదీ పాలనలో పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారు. ధనికులు మరింత ధనవంతులు అవుతున్నారు.
ప్రభుత్వానికి వస్తున్న మొత్తం పన్ను ఆదాయంలో వ్యక్తిగత ఆదాయ పన్ను శాతం క్రమంగా పెరుగుతున్నది. ఇదే సమయంలో కార్పొరేట్ పన్నుల వాటా తగ్గుతున్నది. వ్యక్తిగత ఆదాయ పన్ను అంటే.. దేశ ప్రజలు వారి ఆదాయంపై చెల్లించే పన్ను. కార్పొరేట్ పన్ను అంటే.. దేశంలో వ్యాపార, వాణిజ్యం ద్వారా కంపెనీలు అర్జిస్తున్న ఆదాయంపై చెల్లిస్తున్న పన్ను. మోదీ ప్రభుత్వం ఏర్పడకముందు 2013 – 14లో ప్రభుత్వ మొత్తం పన్ను ఆదాయంలో వ్యక్తిగత ఆదాయ పన్ను వాటా 20.6 శాతం ఉంటే, కార్పొరేట్ పన్ను వాటా 32.1 శాతం ఉండేది. 2023 – 24 నాటికి వ్యక్తిగత ఆదాయ పన్ను వాటా 28.1 శాతం ఉండగా, కార్పొరేట్ పన్ను వాటా 26 శాతానికి తగ్గింది. అంటే, మోదీ ప్రభుత్వం ఏర్పడే నాటికి మొత్తం పన్ను ఆదాయంలో వ్యక్తిగత పన్ను కంటే కార్పొరేట్ పన్ను వాటా దాదాపు 11.5 శాతం ఎక్కువ ఉండేది. ఇప్పుడు 2.1 శాతం తక్కువ ఉన్నది. అంటే, ఈ పదేండ్లలో వ్యక్తిగత ఆదాయ పన్ను వసూలు ఎంతగా పెరిగిందో, కార్పొరేట్ పన్ను రాబడి ఎంత తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 2019 సెప్టెంబరులో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ పన్నులను భారీగా తగ్గించడంతో ఈ అంతరం పెరిగిపోయింది. కార్పొరేట్లు లాభపడ్డారు.
పన్నుల్లో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు ఉంటాయి. ప్రత్యక్ష పన్నులంటే వ్యక్తులు, కంపెనీల ఆదాయంపై నేరుగా విధించే పన్నులు. ఆదాయానికి తగ్గట్టుగా పన్ను ఉంటుంది. అంటే, ఎక్కువ ఆదాయం పొందే వారు ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న వారిపై పన్నులభారం తక్కువ పడుతుంది. పరోక్ష పన్నులు అంటే ఆదాయంతో సంబంధం లేకుండా పరోక్ష పద్ధతిలో విధించే పన్నులు. ఉదాహరణకు.. ఎక్సైజ్ డ్యూటీలు, జీఎస్టీ వంటి పన్నులు. ఈ పన్నులకు ఆదాయంతో పని లేదు. ప్రజలంతా పరోక్షంగా వారు కొనే వస్తువులు, పొందే సేవలపై ఆ పన్ను చెల్లించాల్సిందే. మోదీ హయాంలో ప్రత్యక్ష పన్నులు తగ్గుతూ ఉంటే పరోక్ష పన్నులు పెరుగుతున్నాయి. అంటే, ఆదాయంతో సంబంధం లేకుండా అందరూ చెల్లించాల్సిన పన్నులు పెరుగుతున్నాయి. పేదలు, మధ్యతరగతిపై ఈ భారం పడుతున్నది. 2013 – 14లో పన్నుల ద్వారా ప్రభుత్వానికి వస్తున్న మొత్తం ఆదాయంలో ప్రత్యక్ష పన్నుల వాటా 39.4 శాతంగా ఉంటే 2021 – 22 నాటికి 34.2 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో పరోక్ష పన్నుల వాటా 2013 – 14లో 60.6 శాతం ఉంటే, 2021 – 22 నాటికి 65.8 శాతానికి పెరిగింది.
పన్నులే కాదు ఈ పదేండ్లలో పేదలపై మోయలేనంత ధరల భారం కూడా పడింది. ఇదే సమయంలో వేతనాలు మాత్రం చాలా స్వల్పంగా పెరిగాయి. గత ఐదేండ్లలో ఆహార వస్తువుల ధరలు దాదాపు 71 శాతం పెరిగితే, వేతనాలు మాత్రం కేవలం 37 శాతం మాత్రమే పెరిగాయని లెక్కలు చెప్తున్నాయి. ఉదాహరణకు ఐదేండ్ల క్రితం కిలో బియ్యం ధర రూ.35 – 40 ఉంటే ఇప్పుడు రూ.60కి చేరింది. గోధుమ పిండి ధర రూ.30 ఉంటే ఇప్పుడు రూ.43 ఉంది. ఇలా అన్ని ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగినా ప్రజల ఆదాయం మాత్రం ఇందుకు తగ్గట్టుగా పెరగలేదు. ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా మరింత చితికిపోతున్నారు.