సొంతగడ్డపై పరిమిత ఓవర్ల క్రికెట్లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా.. ఇక టెస్టు ఫార్మాట్ కోసం సిద్ధమవుతున్నది. మరో నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్ ప్రారంభం కానుండగా.. ఇరు జట్లు ప్రాక్టీస్లోమునిగిపోయాయి. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమైన సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సుదీర్ఘ ఫార్మాట్ కోసం నాగ్పూర్లో తమ బ్యాట్లకు పదును పెడుతుండగా.. ఆసీస్ ఆటగాళ్లు బెంగళూరులో ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు.
నాగ్పూర్: ఇటీవల స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్పై వన్డే, టీ20 సిరీస్లు నెగ్గిన భారత్ ఇక టెస్టుల కోసం రెడీ అవుతున్నది. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. స్వదేశంలోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా గురువారం నుంచి నాగ్పూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే భారత ఆటగాళ్లు ఇక్కడికి చేరుకొని ప్రాక్టీస్లో మునిగిపోయారు. మరోవైపు టూర్ మ్యాచ్ను వద్దనుకున్న ఆసీస్ బెంగళూరులో ప్రత్యేక శిక్షణ కొనసాగిస్తున్నది. సాధారణంగా భారత పర్యటనలో విదేశీ జట్లకు స్పిన్ పిచ్లు ఎదురవడం పరిపాటి కావడంతో.. ఆ ఉచ్చును ఛేదించేందుకు కంగారూలు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అటు ఆసీస్ మాజీలు, ఇటు భారత సీనియర్లు ఇప్పటికే తమ మాటలతో సిరీస్పై ఆసక్తి పెంచుతున్నారు.
జడ్డూతో మరింత బలం: రైనా..
ప్రధాన టూర్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు టూర్ మ్యాచ్ ఆడకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని సురేశ్ రైనా పేర్కొన్నాడు.‘వామప్ మ్యాచ్లు ఎంతో ముఖ్యమైనవి. అలాంటి వాటితోనే పిచ్పై ఒక అంచనాకు రావొచ్చు. రవీంద్ర జడేజా కోలుకొని తిరిగి జట్టులోకి రావడం ఆనందంగా ఉంది’ అని రైనా పేర్కొన్నాడు.
ఆసీస్దే గెలుపు: చాపెల్
బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ఆరంభం కాకముందే.. ఆస్ట్రేలియా జట్టే విజయం సాధిస్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ జోస్యం చెప్పాడు. గతంతో పోల్చితే భారత్ బలహీనంగా ఉందని.. అందుకే కంగారూలే గెలుస్తారని చాపెల్ పేర్కొన్నాడు. చాపెల్ శనివారం మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియానే సిరీస్ నెగ్గుతుంది. రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. ఆ జట్టు విరాట్ కోహ్లీపై అతిగా ఆధారపడుతున్నది’ అని పేర్కొన్నాడు.
మాకూ ఆప్షన్స్ ఉన్నాయి: కమిన్స్
బెంగళూరు: ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు మీడియాలో భారీ చర్చ జరుగుతున్నది. ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు కంగారూలు పేస్ పిచ్లతో స్వాగతం పలకడం పరిపాటి కాగా.. అందుకు తగ్గట్లే భారత్ తమ ఇలాకాలో స్పిన్ పిచ్లు తయారు చేయిస్తుందని చర్చ జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘మా వద్ద స్పిన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఆఫ్ స్పిన్, రిస్ట్ స్పిన్, లెఫ్టార్మ్, ఫింగర్ ఇలా మాకు చాలా మంది అందుబాటులో ఉన్నారు. భారత పిచ్లపై 20 వికెట్లు పడగొట్టగల సత్తా మా వాళ్లకు ఉంది’ అని అన్నాడు. ఆస్టిన్ ఆగర్, స్వెప్సన్, మార్ఫె, ట్రావిస్ హెడ్ ఇలా తమకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కమిన్స్ అన్నాడు. భారత్లో భారత్ను ఎదుర్కోవడం కష్టమే అయినా.. అందుకు తగ్గ ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని కమిన్స్ చెప్పాడు.