ఊట్కూర్ : నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో విలేకరులపై దాడి చేసిన దుండగుల ను వెంటనే అరెస్టు (Arrest ) చేయాలని ఊట్కూర్ ( Utkoor ) మండల ప్రెస్ క్లబ్ నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణానదిలో అక్రమ ఇసుక రవాణా ( Illegal Sand Transport ) ను కవర్ చేసేందుకు వెళ్లిన నమస్తే తెలంగాణ మాగనూరు విలేకరి రాము, ఫోటోగ్రాఫర్ తాహెర్ అలీపై ఇసుక మాఫియా దాడికి పాల్పడటం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడేనని వారు ఖండించారు.
ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న పాత్రికేయులపై భౌతిక దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. అక్రమ ఇసుక దందాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం పూర్తి హామీ ఇవ్వాలని, దోషులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి శిక్షించాలని కోరారు.
ఈ సమావేశంలో ఊట్కూర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు అశోక్, విఠోబా, మంజూర్ అలీ, వెంకట్ రాములు, భానుచందర్, అష్ఫక్, సల్మాన్, నరసింహ, వెంకటేష్, అనీల్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.